సయానీ ఘోష్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. బెంగాల్ రాజకీయాల్లో సయానీ ఘోష్ అంటే తెలియని వారుండరు. సినీ గ్లామర్ నుంచి రాజకీయాల వరకు అంతగా పాపులర్ అయిన లీడర్. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలిగా ఉండడంతో జాతీయంగా కూడా పేరుగాంచింది. ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన ఆమె.. 2029లో మమతా బెనర్జీ ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఆమె మాటలు చాలా వైరల్ అయ్యాయి. కానీ కొన్ని వారాలకే అన్ని తల్లకిందులయ్యాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీఎంసీలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబావుటా ఎగరేశారు. ఆశ్చర్యంగా మమత ప్రధానమంత్రి కావాలని కోరుకున్న నాయకురాలే తిరుగుబాటు చేయడంతో జాతీయంగా ఆసక్తిగా మారింది. అసలు ఇంతకీ సయానీ ఘోష్ ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
సయానీ ఘోష్.. 17 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా మారింది. తక్కువ కాలంలోనే ఒక ప్రత్యేకను సంపాదించుకున్నారు. బోల్డ్ పాత్రల్లో కూడా అలరించింది. వెండితెరపై కనిపిస్తూనే.. వెబ్సిరీస్ల్లో కూడా నటించింది. ఇలా ఇంటింటికీ పరిచయమై అందరితో ప్రశంసలు అందుకుంది. అయితే సినిమాల్లో బోరు కొట్టిందో.. ఏమో తెలియదుగానీ కొద్దికాలంలోనే గ్లామర్ ప్రపంచం నుంచి రాజకీయ అవతారమెత్తారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో ఒక ప్రముఖ యువ నాయకుల్లో ఒకరిగా ఎదిగారు. ఆ పార్టీలో అంతగా చోటు సంపాదించుకున్నారు.
టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్లలో తన ప్రతిభను ప్రదర్శించిన తర్వాత సయానీ రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. 2021లో టీఎంసీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. మమతా బెనర్జీ ఆమెపై తన నమ్మకాన్ని కొనసాగించారు. 2024లో అనూహ్యంగా సయానీకి పార్లమెంట్ సీటు కేటాయించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో జాదవ్పూర్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ విజయంతో ఒక నటి నుంచి అనతికాలంలోనే నాయకురాలిగా మారిపోయింది. ఎన్నికల సంఘానికి ఆమె దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. మొత్తం ఆస్తుల విలువ రూ.91.89 లక్షలు.. రూ.59 లక్షల అప్పులు కూడా ఉన్నాయని పేర్కొంది. ఎలాంటి వ్యవసాయ భూమి గానీ, భూ ప్లాట్లు గానీ, వాణిజ్య ఆస్తులు గానీ లేవు అని తెలిపింది. సయానీ కోల్కతాలోని గోల్ఫ్ గ్రీన్లో ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఇంటి విలువ రూ.62.64 లక్షలుగా పేర్కొంది.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తర్వాత.. మమతా బెనర్జీకి అండగా నిలవాల్సిన సమయంలో తిరుగుబాటు నేతలతో చేతులు కలిపింది. చాలా రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆమె గురువారం కోల్కతా ఎయిర్పోర్టులో ఎవరూ గుర్తుపట్టని విధంగా ప్రత్యక్షమైంది. తలకు టోపీ, కళ్లకు అద్దాలు, ముఖానికి మాస్క్ ధరించి కనిపించింది. ఎయిర్పోర్టులోంచి బయటకు రాగానే కారు ఎక్కి వెళ్లిపోయింది. సంక్షోభ సమయంలో తిరుగుబాటు ఎగరేయడంతో బెంగాల్ ప్రజలకు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా కూడా ట్రెండింగ్గా మారింది.

