పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్ రష్యా వైపు మొగ్గు చూపింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రష్యా నుంచి భారీ స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంది. దీంతో రష్యా మళ్లీ భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది. అయితే రాయిటర్స్, బ్లూమ్బర్గ్ నివేదికల ప్రకారం.. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాపై ఇరాన్ యుద్ధ ప్రభావం పడటంతో గల్ఫ్ దేశాల నుంచి దిగుమతులు తగ్గాయి. దీనికి ప్రత్యామ్నాయంగా భారత్ రష్యాతో పాటు లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా ముడి చమురు కొనుగోళ్లను పెంచింది.
ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాతో వాణిజ్య చర్చల నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొంత తగ్గించింది. అయితే అమెరికా తాత్కాలిక మినహాయింపు ఇవ్వడంతో రష్యా నుంచి చమురు దిగుమతులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. జూన్ నెలలోనే భారత పోర్టులకు 2.3 మిలియన్ బ్యారెళ్లకు పైగా రష్యా ముడి చమురు చేరినట్లు బ్లూమ్బర్గ్ వెల్లడించింది. దీని విలువ సుమారు 5.14 బిలియన్ డాలర్లు. రాయిటర్స్ ప్రకారం.. జూన్లో భారత్ రోజుకు సగటున 2.70 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును దిగుమతి చేసుకుంది. ఇది ఆ నెలలో దేశ మొత్తం చమురు దిగుమతుల్లో సగానికి పైగా వాటాను కలిగి ఉంది.
రష్యా చమురుకు ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రధాన కారణం తక్కువ ధరే కారణం. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ.. రష్యా అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు ముడి చమురును విక్రయిస్తోంది. దీంతో భారత రిఫైనరీలకు తక్కువ వ్యయంతో చమురు లభిస్తోంది. మరోవైపు హార్ముజ్ జలసంధిలో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో భారత్ లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా చమురు కొనుగోళ్లను పెంచి సరఫరా వనరులను విస్తరించింది.
పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు దిగుమతి కావడం వల్ల భారత్పై ఇంధన దిగుమతి భారం కొంత తగ్గే అవకాశం ఉంది. అయితే దీని వల్ల వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిపోతాయని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. అయితే రష్యా నుంచి తక్కువ ధరకు చమురు సరఫరా కొనసాగితే ప్రపంచ మార్కెట్లో ఏర్పడే ఒత్తిడిని కొంతవరకు తగ్గించడంతో పాటు భారత్ ఇంధన భద్రతను బలోపేతం చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ధరలు తగ్గించకపోయినా.. సరఫరాలో మాత్రం ఎలాంటి అంతరాయం ఉండకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.

