ఆయోధ్య రామమందిర విరాళాల స్కామ్పై తొలిసారి ఆర్ఎస్ఎస్ స్పందించింది. ఈ ఘటనతో రామభక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రకటనలో తెలిపింది. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఆర్ఎస్ఎస్ తరపున సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే ఈ ప్రకటనను విడుదల చేశారు.
తరతరాల పోరాటం, కోట్లాది రామ భక్తుల అంకితభావం, త్యాగం, అమరత్వం కారణంగా రామ జన్మభూమిపై నిర్మించిన భవ్యమైన ఆలయం యావత్ హిందూ సమాజానికి పూజ్య, విశ్వాస, భక్తికి కేంద్రంగా నిలిచిందని పేర్కొంది. ఆలయంలోని విరాళాల పెట్టెలలో జమ చేసిన నిధుల దొంగతనం దురదృష్టకరమని తెలిపింది. ఇది యావత్ సమాజం, రామ భక్తుల మనోభావాలను, భక్తిని దెబ్బతీసిందని వెల్లడించింది.
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిందని దత్తాత్రేయ హోసబలే పేర్కొన్నారు. దర్యాప్తులో దోషులుగా తేలిన వారికి కఠిన శిక్ష పడటం అత్యవసరం అన్నారు. రామ మందిరానికి వచ్చిన విరాళాలకు సంబంధించి జరిగినట్లు ఆరోపించబడిన దొంగతనం వంటి తీవ్రమైన సంఘటనను తేలికగా తీసుకోబోమని ఆర్ఎస్ఎస్, యావత్ హిందూ సమాజం భావిస్తున్నట్లు తెలిపారు. దీనిని ఒక అసాధారణ కేసుగా పరిగణిస్తూ, ఆలయ వ్యవస్థ, నిర్వహణలోని ఏవైనా లోపాలను తక్షణమే సరిదిద్దుతామని, తద్వారా ఆలయంపై లక్షలాది రామ భక్తుల నమ్మకం, విశ్వాసం చెక్కుచెదరకుండా ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం ప్రజల్లో చాలా గందరగోళం, సందేహాలు నెలకొని ఉన్నాయని, వాటికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ తెలిపింది. అందుకు ఆలయ యాజమాన్యం, ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పారదర్శకంగా ఉండి.. ఆలయాన్ని సక్రమంగా నిర్వహించి, మతపరమైన పవిత్రతను కాపాడితే రామ్ జన్మభూమి హిందూ సమాజపు విశ్వాసాన్ని, నమ్మకాన్ని మునుపటిలాగే బలంగా నిలబెడుతుందని సంఘ్ విశ్వాసం వ్యక్తం చేసింది.

