RBI Gold Reserves: భారత్‌కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ

Gold Reserves

Gold Reserves

RBI Gold Reserves: ప్రపంచవ్యాప్తంగా నెలకున్న యుద్ధ వాతావరణం, వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో దశాబ్దాలుగా దాచిన తన బంగారు నిల్వలను ఆర్బీఐ వేగంగా స్వదేశానికి తరలిస్తోంది. “బంగారం మీ దగ్గర లేకపోతే, అది మీది కాదు” అనే కొత్త ఆర్థిక సూత్రాన్ని పాటిస్తూ భారత్ ఈ అడుగులు వేస్తోంది.

ఆరు నెలల్లోనే 104 టన్నుల బంగారం తరలింపు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం (అక్టోబర్ 2025 – మార్చి 2026).. గడిచిన ఆరు నెలల్లోనే రికార్డు స్థాయిలో 104.23 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. ప్రస్తుతం భారతదేశం వద్ద ఉన్న మొత్తం 880.52 టన్నుల బంగారు నిల్వల్లో దాదాపు 77 శాతం (సుమారు 680 టన్నులు) ఇప్పుడు దేశీయ ఖజానాల్లోనే భద్రంగా ఉన్నాయి. కేవలం రెండేళ్ల క్రితం (మార్చి 2023) ఇది కేవలం 37 శాతంగా మాత్రమే ఉండేది.

ఎందుకీ “బంగారం వేట” అంటే..
విదేశాల్లోని బ్యాంకుల్లో బంగారం నిల్వ చేయడం సురక్షితం కాదనే అనుమానాలు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాకు చెందిన ఆస్తులను పాశ్చాత్య దేశాలు స్తంభింపజేయడం ప్రపంచ దేశాలను ఆలోచనలో పడేసింది. రేపు ఏదైనా రాజకీయ కారణాల వల్ల మన ఆస్తులు కూడా విదేశాల్లో నిరుపయోగంగా మారకూడదని భారత్ భావిస్తోంది. ఇరాన్ – మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉంది. ఇలాంటి సమయంలో బంగారం సొంత నియంత్రణలో ఉండటమే అసలైన ‘భద్రతా భీమా’ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో వ్యాపార లావాదేవీలు సులభంగా ఉంటాయని లండన్, న్యూయార్క్ మార్కెట్లలో బంగారాన్ని నిల్వ చేసేవారు. కానీ ఇప్పుడు భద్రత అంటే విదేశాల్లో దాచడం కాదు, మన కళ్ల ముందే భద్రపరుచుకోవడమని ఆర్బీఐ నిరూపిస్తోంది. ప్రస్తుతం 197.67 టన్నుల బంగారం మాత్రమే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద ఉంది. భారత విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా కూడా 13.9% నుంచి 16.7%కి పెరగడం గమనార్హం. ఇది భారతదేశం బంగారంపై చూపిస్తున్న నమ్మకాన్ని, ఆర్థిక స్వయం సమృద్ధి దిశగా వేస్తున్న అడుగులను స్పష్టం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.