Awadhesh Prasad: ‘‘రామ్, సీతా మీరు ఎక్కడ ఉన్నారు..?’’ విలపించిన అయోధ్య ఎంపీ..

  • కన్నీటిపర్యంతమైన అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్..
  • దళిత మహిళ అత్యాచారం, హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్..
  • న్యాయం జరగకుంటే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా..
Awadhesh Prasad

Awadhesh Prasad

Awadhesh Prasad: ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు. అయోధ్య కూడా ఈ ఫైజాబాద్ ఎంపీ పరిధి కిందకే వస్తుంది. గతేడాది ఫైజాబాద్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరుపున గెలిచిన అవధేశ్ ప్రసాద్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. అయితే, ఆయన దళిత యువతి అత్యాచారం, హత్యపై భావోద్వేగానికి గురయ్యారు. అయోధ్యకు సమీపంలో అత్యాచారం చేసి, హత్యకు గురైన 22 ఏళ్ల దళిత మహిళ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఎంపీ పదవీకి రాజీనామా చేస్తానని ఆదివారం విలేకరుల సమావేశంలో విలపించారు.

దీనికి సంబంధించిన విజువల్స్ వైరల్ అయ్యాయి. తాను ఈ విషయాన్ని లోక్‌సభలో ప్రధాని మోడీ ముందు లేవనెత్తుతానని అన్నారు. మాకు న్యాయం జరగకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. మనం మన ఆడకూతుళ్లను కాపాడుకోవడంలో విఫలమవుతున్నామని అన్నారు. ‘‘మర్యాద పురుషోత్తమ రామ, సీతా మాత మీరు ఎక్కడ ఉన్నారు..?’’ అంటూ విలపించారు. అయోధ్యలోని మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందు ఈ ఘటన జరిగింది.

Read Also: Keerthi Suresh: అప్పటి నుంచి అతని అన్నయ్య అని పిలుస్తున్న : కీర్తి సురేష్

లోక్‌సభకు ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత, మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి అవధేష్ ప్రసాద్ రాజీనామా చేశారు. ఫిబ్రవరి 05న ఈ స్థానానికి ఉప ఎన్నికల జరగనుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రసిద్ధ రామమందిరం నిర్మించిన తర్వాత కూడా అయోధ్య ఉన్న ఫైజాబాద్‌లో బీజేపీ ఓడిపోయింది. దీంతో మిల్కిపూర్‌లో ఎలాగైనా గెలవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు లోక్‌సభ ఫలితాలనే పునరావృతం చేయాలని సమాజ్‌వాదీ పార్టీ పనిచేస్తోంది.

ఇటీవల అయోధ్య జిల్లాలోని ఒక కాలువలో అత్యాచారం, హత్య బాధితురాలి మృతదేహం లభించింది. ఆమె గురువారం రాత్రి ఒక మతపరమై సమావేశానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహానికి దుస్తులు లేకుండా, శరీరంపై గాయాలు కనిపించాయని, ఆమెను తాళ్లతో కట్టివేశారని కుటుంబీకులు ఆరోపించారు.