ప్రతిపక్షాలపై కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. విద్యార్థులను రాజకీయాలకు వాడుకుంటారా? అంటూ మండిపడ్డారు. గత కొద్దిరోజులుగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై సీజేపీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ నిరసనలు తీవ్రమయ్యాయి. సోమవారం విద్యార్థులపై లాఠీఛార్జ్ జరిగిన తర్వాత ఉద్యమం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పుడు విద్యార్థుల ఉద్యమం కాంగ్రెస్ వైపు మళ్లింది.
తాజాగా ఇదే వ్యవహారంపై కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ స్పందిస్తూ విపక్ష పార్టీలపై మండిపడ్డారు. విద్యార్థులు, యువతను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల సంక్షేమం, వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ‘‘దేశ విద్యార్థులు, యువతను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరం. ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం, వారి భవిష్యత్తు కోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోంది.’’ అని పేర్కొన్నారు.
విద్యార్థులు లేవనెత్తే ప్రతి సమస్యను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టం చేశారు. ‘‘ఏ విద్యార్థికీ, ఏ యువకుడికీ అన్యాయం జరగకుండా చూడడం మా బాధ్యత. ప్రతిపక్ష నాయకులు సృష్టిస్తున్న కృత్రిమ ఆగ్రహం ప్రజలను, ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టించే విఫలయత్నం మాత్రమే. దేశ యువత అలాంటి మోసపూరిత ప్రయత్నాలను తిరస్కరిస్తుందని నాకు నమ్మకం ఉంది.’’ అని అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయని గుర్తు చేసిన రాజ్నాథ్ సింగ్.. విద్యార్థులకు సంబంధించిన అంశాలతో సహా ప్రతి అంశంపై అర్థవంతమైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు సభలో చర్చించకుండా వీధుల్లో ఆందోళనలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి పార్లమెంటే సరైన వేదిక అని.. వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించి.. తమ అభ్యంతరాలన్నింటినీ సభలోనే లేవనెత్తాలని సూచించారు.
సోమవారం సీజేపీ (బొద్దింకల జనతా పార్టీ) చేపట్టిన ‘చలో సంసద్’ ఉద్యమం హింసాత్మకంగా మారిన అనంతరం ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. మంగళవారం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, విపక్ష కూటమి ఎంపీలతో కలిసి జంతర్మంతర్ సమీపంలో విద్యార్థులకు మద్దతుగా నిరసన చేపట్టారు. అనంతరం ప్రధాని మోడీ నివాసం దగ్గర జరిగిన ఆందోళనలో పలువురు ప్రతిపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.
https://x.com/rajnathsingh/status/2079851257389605273

