Site icon NTV Telugu

Rahul Gandhi: రైతులతో రాహుల్‌గాంధీ భేటీ.. ‘‘స్టేజ్ మేనేజ్డ్’’ అంటూ బీజేపీ ధ్వజం

Rahulgandhi

Rahulgandhi

భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరిగింది. ఇరు దేశాలు త్వరలో సంతకాలు కూడా చేయనున్నాయి. అయితే అమెరికా వాణిజ్య ఒప్పందంతో అన్నదాతలు రోడ్డెక్కారు. కేంద్ర నిర్ణయంతో రైతులకు ఇబ్బందులేనని వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ రైతులతో సమావేశం అయ్యారు. ఇప్పటికే ఒకసారి భేటీ కాగా.. తాజాగా మరోసారి పార్లమెంట్ హాల్‌లో కలిశారు. దేశ వ్యాప్తంగా ఉన్న 17 ప్రధాన రైతు సంఘాల ప్రతినిధులను కలిశారు. ఈ ఒప్పందం కారణంగా భారతీయ రైతులకు.. ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, పండ్లు, గింజలు పండించే రైతులకు హాని కలిగిస్తుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ దేశ వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

రైతులతో రాహుల్ గాంధీ భేటీ కావడంపై కేంద్రమంత్రి పియూష్ గోయల్ ధ్వజమెత్తారు. దశల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారని ఇదంతా ‘‘స్టేజ్ మేనేజ్డ్’’ అంటూ ధ్వజమెత్తారు. అత్యంత కృత్రిమమైన, నకిలీ సమావేశంగా అభివర్ణించారు. రైతులను తప్పుదారి పట్టించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కష్టపడి పనిచేసే అన్నదాతలను గందరగోళానికి గురిచేయడం, ప్రభుత్వ ఆర్థిక విధానానికి వ్యతిరేకంగా మనోభావాలను రెచ్చగొట్టడం ఈ సమావేశం లక్ష్యం అని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అన్నారు.

ఇది కూడా చదవండి: Nigeria Video: విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో పేలుడు.. హడలెత్తిపోయిన ప్రయాణికులు

భారత వస్తువులపై పరస్పర సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడానికి అమెరికా అంగీకరించిందని… ఇది వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ఔషధాలలో భారత ఎగుమతులకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రభుత్వం పేర్కొంది. రైతుల ప్రయోజనాలను కాపాడుతూ 90-95 శాతం భారతీయ వ్యవసాయ ఉత్పత్తులను ఈ ఒప్పందం నుంచి మినహాయించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇటీవలే భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరిగింది. గతంలో ఉన్న 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ బలపడ్డాయి.

 

Exit mobile version