ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇటీవల నితిన్ నబిన్ రాజ్యసభకు వెళ్లడంతో బీహార్లోని బంకిపూర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దీంతో త్వరలోనే ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఈ బైపోల్లో స్వయంగా రంగంలోకి దిగాలని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రచారానికి పరిమితం అయ్యారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తాజాగా మీడియాకు తెలియజేశారు.
ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్.. “నా పోటీ వల్ల బీజేపీకి బలమైన కోటగా ఉన్న బంకిపూర్లో పార్టీని ఓడించే అవకాశం ఉంటే నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని స్పష్టం చేశారు. ఈ ఉపఎన్నిక ఒక ఎమ్మెల్యే స్థానానికే పరిమితం కాదని, సమ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నాయకత్వం, ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఇచ్చే తీర్పుగా భావించాలని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించడానికి ప్రధాన కారణం నితీశ్ కుమార్ నాయకత్వమేనని ప్రశాంత్ కిషోర్ అన్నారు. సమ్రాట్ చౌదరి పేరుతో ప్రజలు ఓటు వేయలేదని, ముఖ్యమంత్రి మార్పుపై బంకిపూర్ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని ఆరోపించారు.
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ 243 స్థానాల్లో 238 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టినా.. ప్రశాంత్ కిషోర్ మాత్రం స్వయంగా పోటీ చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే తాను ఎన్నికలకు దూరంగా ఉన్నానని అప్పట్లో చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో జన్ సురాజ్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.4 శాతం ఓటు శాతం మాత్రమే లభించింది.
ఇప్పుడైతే ఒక్క బంకిపూర్ స్థానానికే ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ స్వయంగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన పోటీ చేస్తే ఈ ఎన్నిక బీజేపీ, జన్ సురాజ్ మధ్య ప్రతిష్ఠాత్మక పోరుగా మారే అవకాశముంది. అంతేకాదు ఈ ఉపఎన్నికను ఒకవైపు ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి నాయకత్వానికి తొలి ఎన్నికల పరీక్షగా.. మరోవైపు ప్రశాంత్ కిషోర్ వ్యక్తిగత రాజకీయ బలాన్ని అంచనా వేసే పోరుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో బంకిపూర్ ఉపఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
నితిన్ నబిన్..
నితిన్ నబిన్.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం రాజ్యసభకు వెళ్లారు. దీంతో బంకిపూర్ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. త్వరలోనే స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. చిన్న వయసులో (45 ఏళ్ళు) ఈ పదవిని చేపట్టిన పిన్న వయస్కుడిగా నితిన్ నబిన్ రికార్డు సృష్టించారు.

