పవిత్ర అమర్నాథ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. వర్షం కురుస్తున్నప్పటికీ వేలాది మంది శివభక్తులు, పహల్గామ్ బేస్ క్యాంపుల నుంచి బాబా బర్ఫానీ దర్శనం కోసం ప్రయాణం మొదలుపెట్టారు. తొలి రోజే 10 వేల మందికి పైగా యాత్రికులు యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అమర్నాథ్ యాత్రికులకు ప్రత్యేక లేఖ రాస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రతి భక్తుడు ఐదు సంకల్పాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
యాత్ర ఆగస్టు 28 వరకు
అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది ఆగస్టు 28 వరకు కొనసాగనుంది. బల్తాల్ మార్గంలో వెళ్లే భక్తులు అదే రోజు సాయంత్రానికి బాబా బర్ఫానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండగా, పహల్గామ్ మార్గంలో వెళ్లే యాత్రికులు మరుసటి రోజు దర్శనం పొందనున్నారు.
యాత్ర గొప్ప ఆధ్యాత్మిక అనుభవం: ప్రధాని మోడీ
భక్తులకు రాసిన లేఖలో ప్రధాని మోడీ, “హర హర మహాదేవ్.. జై బాబా బర్ఫానీ” అంటూ శుభాకాంక్షలు తెలిపారు. అమర్నాథ్ యాత్రలో పాల్గొనడం ప్రతి భక్తుడికి గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. దేశం నలుమూలల నుంచి, విభిన్న భాషలు, సంప్రదాయాలకు చెందిన లక్షలాది మంది శివభక్తులు మహాదేవుని దర్శనం కోసం ఒకే సంకల్పంతో రావడం భారత ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీక అని అన్నారు.
భద్రతా బలగాలు, సేవా సిబ్బందికి అభినందనలు
యాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్న శ్రీ అమర్నాథ్జీ శ్రైన్ బోర్డు, జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వం, భారత సైన్యం, CRPF, జమ్మూ-కాశ్మీర్ పోలీసులు, ITBP, BSF, NDRF, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, అధికారులు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రధాని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
జమ్మూ-కాశ్మీర్ ఆతిథ్యాన్ని కొనియాడిన ప్రధాని
అమర్నాథ్ యాత్ర భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. జమ్మూ-కాశ్మీర్ ప్రజలు యాత్రికులకు ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ అందిస్తున్న సేవలు దేశ సంస్కృతికి ప్రతిబింబమని అన్నారు. అలాగే దేశవ్యాప్తంగా నుంచి వచ్చిన భక్తులు నిర్వహిస్తున్న అన్నదానం, లంగర్ సేవలు ‘సర్వే భవంతు సుఖినః’ అనే భారతీయ సంస్కృతికి నిదర్శనమని కొనియాడారు.
యాత్రికులకు ప్రధాని సూచించిన ఐదు సంకల్పాలు
అమర్నాథ్ యాత్రలో పాల్గొనే ప్రతి భక్తుడు ఈ ఐదు సంకల్పాలు చేయాలని ప్రధాని మోడీ కోరారు.
1. పరిశుభ్రత పాటిద్దాం
యాత్రా మార్గంలో పరిశుభ్రతను కాపాడుతూ, స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని సూచించారు.
2. భద్రతా నిబంధనలు పాటిద్దాం
అధికారులు జారీ చేసే సూచనలు, ట్రాఫిక్ నియమాలు, భద్రతా మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని కోరారు. వర్షాలు, జారుడు మార్గాలు, చలి వంటి పరిస్థితులపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
3. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం
‘వోకల్ ఫర్ లోకల్’ భావనతో యాత్ర ఖర్చులో కనీసం 10 శాతం స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి వినియోగించాలని పిలుపునిచ్చారు. దీంతో జమ్మూ-కాశ్మీర్ ప్రజల జీవనోపాధికి మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు.
4. మొక్కను బహుమతిగా ఇవ్వాలి
యాత్ర ముగిసే రోజు రక్షాబంధన్ సందర్భంగా తమ సోదరుడు లేదా సోదరికి ఒక మొక్కను బహుమతిగా ఇవ్వాలని, ‘తల్లి పేరు మీద ఒక చెట్టు’ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని సూచించారు.
5. దేశాభివృద్ధికి కృషి
‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ విధులను నిజాయితీగా నిర్వర్తిస్తూ, అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.
“మీ యాత్ర సురక్షితంగా, శుభప్రదంగా సాగాలి”
చివరగా ప్రధాని మోడీ, బాబా అమర్నాథ్ ఆశీస్సులు ప్రతి భక్తుడిపై ఉండాలని ఆకాంక్షించారు. యాత్ర భక్తులకు నూతన శక్తి, ఆధ్యాత్మిక చైతన్యం అందించాలని, “మీ యాత్ర సురక్షితంగా, శుభప్రదంగా సాగాలి” అంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
बाबा बर्फानी के दर्शन से जुड़ी श्री अमरनाथ यात्रा हमारी आध्यात्मिक परंपरा और सांस्कृतिक एकता का शाश्वत अध्याय है। मेरी कामना है कि शिवभक्तों की यह यात्रा हर तरह से सुरक्षित और मंगलमय हो! इस पावन अवसर पर श्रद्धालुओं के लिए पांच संकल्पों से जुड़ा मेरा यह पत्र… pic.twitter.com/6Bc2Y9tXJC
— Narendra Modi (@narendramodi) July 3, 2026

