భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ తదుపరి దశకు సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ (GFF) 2026లో మంగళవారం ప్రధాని ప్రసంగించారు. గత దశాబ్ద కాలంలో భారత ఫిన్టెక్ ప్రయాణం ఎంతో ప్రత్యేకంగా సాగిందని గుర్తుచేశారు. దేశ డిజిటల్ పరివర్తనలో యూపీఏ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. దేశం ఇప్పటికే అవసరమైన స్థాయి, విస్తృతి, ప్రజలందరికీ అందుబాటు వంటి అంశాలను సాధించిందని.. ఇప్పుడు ఫిన్టెక్ వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)ను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
“డిజిటల్ ఇండియా విజయగాథ తదుపరి దశకు సిద్ధంగా ఉంది. మనకు అవసరమైన స్థాయి, విస్తృతి, ప్రజలందరికీ అందుబాటు ఉన్నాయి” అని అన్నారు. గత పదేళ్లలో భారత్లో ఫిన్టెక్ రంగం విస్తరించడం వల్ల గతంలో అధికారిక ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉన్న కోట్లాది మంది ప్రజలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చారని మోడీ చెప్పారు. “పదేళ్ల క్రితం బ్యాంకింగ్ సేవలు మీ చేతివేళ్ల దగ్గరకు వస్తాయని చెప్పినప్పుడు.. అది సాధ్యమేనా అని చాలామంది భావించారు” అని గుర్తుచేశారు. యూపీఐ కారణంగా భారతీయులు ఆర్థిక సేవలను వినియోగించే విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు. భారత్ అభివృద్ధి కథనంతో UPI విడదీయరాని సంబంధాన్ని ఏర్పరచుకుందని అన్నారు.
యూపీఐకి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించిందని.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దీనిని “సివిలైజేషన్ స్టోరీ”గా అభివర్ణించిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు. “భారత్ UPI ఇప్పుడు 11 దేశాల్లో ప్రత్యక్షంగా అందుబాటులో ఉంది. ఇక మన తదుపరి లక్ష్యం ఇతర దేశాల పేమెంట్ వ్యవస్థలతో అనుసంధానం కావాలి” అని మోడీ అన్నారు. ఆధార్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, UPI వంటి భారత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థలు.. డిజిటల్ గుర్తింపు, తక్షణ చెల్లింపులు, సమ్మతి ఆధారిత డేటా షేరింగ్ వంటి సేవలను భారీ స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కీలకంగా నిలిచాయని ప్రభుత్వం చెబుతోంది.
UPI నుంచి తదుపరి తరం ఫిన్టెక్ వైపు
భారత్ ఫిన్టెక్ రంగం తదుపరి దశ కేవలం డిజిటల్ చెల్లింపులకే పరిమితం కాకూడదని మోడీ అన్నారు. రుణాలు, పొదుపులు, పెన్షన్లు, బీమా వంటి రంగాల్లోనూ టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచాలని సూచించారు. ముఖ్యంగా వీధి వ్యాపారులను అధికారిక రుణ వ్యవస్థలోకి మరింతగా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో PM SVANidhi క్రెడిట్ కార్డు పథకాన్ని 2030 వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. వినియోగదారుల ఆర్థిక అవసరాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయని.. టెక్నాలజీ సహాయంతో ఆ అవసరాలను మెరుగ్గా అర్థం చేసుకుని వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన ఆర్థిక ఉత్పత్తులను రూపొందించవచ్చని చెప్పారు.
ఏజెంటిక్ AI, క్వాంటమ్ టెక్నాలజీపై ఫోకస్
ఫైనాన్షియల్ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించగల సాంకేతికతల్లో క్వాంటమ్ కంప్యూటింగ్, ఏజెంటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలకమైనవని ప్రధాని అన్నారు. GFF 2026లోనూ ఏజెంటిక్ AI, టోకెనైజేషన్, క్వాంటమ్ టెక్నాలజీలపైనే ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో సమగ్ర ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో ఈ సాంకేతికతలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యత
భారత్లో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీకి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ స్పష్టం చేశారు. అదే సమయంలో ఫిన్టెక్ రంగానికి బలమైన నియంత్రణ వ్యవస్థ కూడా అవసరమని అన్నారు. తదుపరి దశలో ఆవిష్కరణలకు టెక్నాలజీ సామర్థ్యాలతో పాటు విశ్వాసం, భద్రత, సమర్థవంతమైన నియంత్రణ కూడా కీలకమని పేర్కొన్నారు.

