PM Modi: పుతిన్‌ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.

  • 2022లో ఉక్రెయిన్‌పై అణు దాడిని మోడీనే అడ్డుకున్నారు.
  • పుతిన్ మోడీ మాటకు విలువనిస్తారు.
  • భారత్, చైనా నాయకుల మాటకు రష్యా ప్రాధాన్యం.
  • సంచలన వ్యాఖ్యలు చేసిన పోలాండ్ మంత్రి.
Modiputin

Modiputin

PM Modi: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత ప్రధాని నరేంద్రమోడీ కీలక పాత్ర పోషించాలని పోలాండ్ ఉప విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ టియోఫిల్ బార్టోషెవ్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022లో ఉక్రెయిన్‌పై వ్యూహాత్మక అణ్వాయుధాలను ప్రయోగించకుండా పుతిన్‌ను మోడీ అడ్డుకున్నారని చెప్పారు. మోడీ జోక్యంతోనే అణు యుద్ధంగా మారలేదని వెల్లడించారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలో కొద్ది మంది నేతల మాటలే వింటారని, అందులో ప్రధాని మోడీ ఒకరని అన్నారు. భారత్‌-రష్యాల మధ్య దశాబ్ధాల స్నేహ సంబంధాలు ఉన్నాయని, శాంతి చర్చల్లో భారత్ ప్రత్యేక స్థానం సంపాదించుకుందని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందిన నేత అని, ఆయన అభిప్రాయాలను పుతిన్ సీరియస్‌గా పరిగణిస్తారని పోలాండ్ మంత్రి అన్నారు.

భారత్‌తో పాటు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ కూడా పుతిన్‌తో మాట్లాడగలితే నాయకుడని తెలిపారు. రష్యా శత్రవులుగా భావించని దేశాల నుంచి వచ్చే సూచనల్ని పుతిన్ ప్రాధాన్యం ఇస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేయడాన్ని విమర్శించిన విషయాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. అయితే తక్కువ ధరల కారణంగా భారత్ ఈ నిర్ణయం తీసుకుందని ఇప్పుడు అర్థమైందని, ఈ అంశంపై భారత్-పోలాండ్ మధ్య విభేదాలు తగ్గాయని అన్నారు. ఇటీవల సెయింట్ పీటర్స్ బర్గ్‌ అంతర్జాతీయ ఆర్థిక వేదికపై పుతిన్ మోడీని కొనియాడారు. ఆయనపై ఒత్తిడి తీసుకురావడం ఎవరి వల్ల సాధ్యం కాదని అన్నారు.