PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ

  • ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది
  • దేశానికి సాధ్యమైనంత సహకారం అందించండి
  • భారత్ విశ్వసనీయ వారధి అన్న ప్రధాని మోడీ
Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం యూఏఈలో పర్యటించిన మోడీ.. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో పర్యటిస్తున్నారు. భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.

‘‘నెదర్లాండ్స్‌లో నివసిస్తున్న భారతీయ సమాజాన్ని నేను కోరుతున్నాను. మీరు భారతదేశానికి సాధ్యమైనంత ఎక్కువగా సహకారం అందించండి. ఇది దేశ సామర్థ్యాన్ని పెంపొందించడమే కాకుండా.. మీ పెట్టుబడులపై మీకు మరింత అధిక ప్రతిఫలాన్ని కూడా అందిస్తుంది. ఇది మోడీ గ్యారెంటీ.’’ అని అన్నారు.

‘‘భారత్‌లో జరిగిన టీ20 క్రికెట్ ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్ బాగా ఆడింది… నెదర్లాండ్స్ క్రికెట్‌లో భారతీయులు ఎలాగైతే తమ వంతు సహకారం అందిస్తున్నారో.. అలాగే భారత హాకీకి నెదర్లాండ్స్ కూడా సహకారం అందిస్తోంది. భారత మహిళల హాకీలో కోచ్ స్జోర్డ్ మారిజ్నే కీలక పాత్ర పోషించారు.’’ అని గుర్తుచేశారు.

‘‘ఇంధన భద్రత, జల భద్రతతో సహా పలు రంగాల్లో భారతదేశం, నెదర్లాండ్స్ అద్భుతంగా కలిసి పనిచేస్తున్నాయి. భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) , నెదర్లాండ్స్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. భారతీయ వ్యాపారాలు యూరప్‌లోకి ప్రవేశించడానికి నెదర్లాండ్స్ ఒక సహజ ముఖద్వారంగా మారుతుంది. ఈ ప్రయాణంలో మన భారతీయ సమాజం ఒక విశ్వసనీయమైన వారధిగా పనిచేయగలదు.’’ అని ఆకాంక్షించారు.

‘‘ప్రస్తుతం ప్రపంచం సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. మొదట కరోనా.. ఇప్పుడు యుద్ధం.. ఇంధన సంక్షోభం. ఈ దశాబ్దం సవాళ్లతో నిండిపోతోంది. పరిస్థితులు వేగంగా మారకపోతే.. గత అనేక దశాబ్దాల విజయాలు వృధా అవుతాయి. ప్రపంచ జనాభాలో ఒక భారీ భాగం పేదరికంలో కూరుకుపోతుంది. ఇటువంటి క్లిష్ట సమయాల్లో భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండే సరఫరా వ్యవస్థను (supply chain) ఏర్పాటు చేసేందుకు భారతదేశం-నెదర్లాండ్స్ కృషి చేస్తున్నాయి.’’ అని పేర్కొన్నారు.

‘‘ఝల్‌మురి ఇక్కడికి కూడా చేరుకుందా? ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 80–90 శాతంగా నమోదైంది.ఇందులో మహిళల భాగస్వామ్యం విశేషంగా ఎక్కువగా ఉంది… ప్రతి ఏటా ఓటింగ్ రికార్డులు బద్దలవుతున్నాయి. బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి నేటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి.’’ అని మోడీ గుర్తుచేశారు.