BJP: ఇండోర్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన ‘‘ఛాత్రోంకీ గుంజ్’’ కార్యక్రమం వివాదాస్పదమైంది. ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి చేసిన స్కిట్పై బీజేపీ తీవ్రంగా స్పందించింది. పుల్కిత్ మణి ప్రధాని మోడీ హావభావాలను అనుకరిస్తూ కామెడీ చేశాడు. ఆ సమయంలో వేదికపై రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ దీనిపై తీవ్రంగా స్పందిస్తూ.. ఇలాంటి ప్రదర్శన ‘అసభ్య ప్రవర్తన, చౌకబారు, అసభ్య ట్రోల్స్’గా అభివర్ణించారు. మర్యాద, బాధ్యతగా ఆలోచించే వ్యక్తి ఇలాంటి చర్యల్ని వినోదంగా భావించరని వ్యాఖ్యానించారు. ఇలాంటి పొలిటికల్ కల్చర్ కారణంగా యువతలో రాహుల్ గాంధీకి తగిన స్పందన లభించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల్లో ఏబీవీపీ విజయం, కాంగ్రెస్ మద్దతు ఉన్న ఎన్ఎస్యూఐ ఓటమిని ప్రస్తావించారు. ఇలాంటి ప్రదర్శనలకు మద్దతు ఇవ్వడం ద్వారా రాజకీయ నాయకుడిగా తనను తాను సీరియస్గా తీసుకునే పరిస్థితిని రాహుల్ గాంధీ దిగజార్చుకుంటున్నారని అన్నారు. ఓ వృద్ధ మహిళను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కేశవన్ అభ్యంతరం తెలిపారు. దీనిని మహిళల్ని అవమానించడంగా అభివర్ణించారు.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్ ‘కామెడియన్లు, జోకర్ల పార్టీగా మారింది’’ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ అంశంపై స్పందిస్తూ.. ఈ స్కిట్ ద్వారా ప్రధాని మోడీ దివంగత తల్లిని రాహుల్ అవమానించారని మండిపడ్డారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా రాహుల్ తీరును విమర్శించారు.

