ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి ‘బుక్మైషో’లో ఈవెంట్ జరగబోతుంది. సెప్టెంబర్ 8న గుజరాత్లోని వడోదరలో కార్యక్రమం జరగనుంది. అయితే కార్యక్రమానికి అనూహ్యంగా భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించగా.. అందుబాటులో ఉన్న సీట్లన్నీ కేవలం 30 నిమిషాల్లోనే బుక్ అయిపోయాయి. దీంతో నిర్వాహకులు రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు.
తొలిసారి BookMyShow
వడోదర మున్సిపల్ కార్పొరేషన్ తొలిసారిగా ప్రైవేట్ డిజిటల్ ప్లాట్ఫామ్ BookMyShow ద్వారా ప్రధాని మోడీ కార్యక్రమానికి ప్రజల రిజిస్ట్రేషన్లను నిర్వహించింది. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించడంతో భారీ సంఖ్యలో ప్రజలు స్పందించారు. సీట్లన్నీ బుక్ కావడంతో రిజిస్ట్రేషన్లు మూసివేయగా.. మరో 42,000 మందికి పైగా అదనపు దరఖాస్తుదారులను వెయిటింగ్ లిస్ట్లో చేర్చారు. దీంతో ఈ కార్యక్రమంపై ప్రజల్లో ఎంతటి ఆసక్తి ఉందో అర్థమవుతోంది.
పూర్తిగా డిజిటల్ ఎంట్రీ సిస్టమ్
ఈ కార్యక్రమంలో ప్రవేశం కూడా పూర్తిగా డిజిటల్, టెక్నాలజీ ఆధారిత విధానంలో ఉండనుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వారి BookMyShow ఖాతా ద్వారా డిజిటల్ M-Ticket అందుతుంది. అందులో సెక్యూర్ లైవ్ QR కోడ్ ఉంటుంది. వేదిక దగ్గర ప్రవేశ సమయంలో ఈ QR కోడ్ను స్కాన్ చేసి పాల్గొనేవారిని ధృవీకరించనున్నారు. రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, వేదికలోకి ప్రవేశం, సీటింగ్.. ఇలా మొత్తం ప్రక్రియను డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. దీనివల్ల ప్రేక్షకులకు వేగంగా ప్రవేశం కల్పించడంతో పాటు భారీ జనసందోహాన్ని సులభంగా నియంత్రించేందుకు వీలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
సెప్టెంబర్ 8న ప్రధాని మోడీ వడోదరలో పర్యటించనున్నారు. గుజరాత్లో రూ.35,000 కోట్లకు పైగా విలువైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వీటిలో వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (WDFC)లో కీలక అభివృద్ధి పనులు, కొత్త రైల్వే లైన్లు, రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని పలు హైవే ప్రాజెక్టులు ఉన్నాయి. మోడీ పర్యటనతో గుజరాత్లో కొనసాగుతున్న మౌలిక వసతుల విస్తరణపై ప్రధానంగా దృష్టి పడనుంది. ముఖ్యంగా రైల్వే, రోడ్డు కనెక్టివిటీకి సంబంధించిన ప్రాజెక్టులు ఈ పర్యటనలో కీలకంగా నిలవనున్నాయి.

