Site icon NTV Telugu

Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్‌ ఖేరాకు చుక్కెదురు.. ముందస్తు బెయిల్‌ తిరస్కరణ

Pawan Khera

Pawan Khera

కాంగ్రెస్ నేత పవన్ ఖేరా‌కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భుయాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. భార్యకు విదేశాల్లో ఉన్న ఆస్తులను హిమంత శర్మ తన అఫిడవిట్‌లో ప్రస్తావించలేదని ఆరోపించారు. ఈ క్రమంలో రిణికి భుయాన్‌ శర్మ ఫిర్యాదు మేరకు పవన్‌ ఖేరాపై గౌహతిలో కేసు నమోదైంది.

అసలేం జరిగిందంటే..
ఇటీవల ఢిల్లీ, గౌహతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పవన్ ఖేరా మాట్లాడుతూ.. సీఎం హిమంత శర్మ భార్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. యూఏఈ, ఈజిప్ట్, ఆంటిగ్వా-బార్బుడా దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని.. అంతేకాకుండా దుబాయ్‌లో ఆస్తులు, షెల్ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయాలను హిమంత శర్మ తన అఫిడవిట్‌లో పేర్కొనలేదని తెలిపారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏప్రిల్ 6న సీఎం భార్య రిణికి భుయాన్ శర్మ గౌహతి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌లో ఖేరా సహా ఇతరులపై ఫిర్యాదు చేశారు. దీంతో భారతీయ న్యాయ సంహిత (BNS) కింద పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు.

ఏప్రిల్ 7న అస్సాం పోలీసులు ఢిల్లీలోని ఖేరా నివాసానికి వెళ్తే కనిపించలేదు. అనంతరం ఖేరా ఏప్రిల్ 10న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా వారం రోజుల పాటు తాత్కాలిక రక్షణ లభించింది. ఈ నేపథ్యంలో అస్సాం పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఏప్రిల్ 15న అత్యున్నత న్యాయస్థానం బెయిల్‌పై స్టే విధించింది. అస్సాంలో సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. తర్వాత సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్ వేసినా.. అది కూడా తిరస్కరించబడింది. దీంతో పవన్ ఖేరా గౌహతి హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 21న ఇరుపక్షాల వాదనలు విన్న గౌహతి హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా ముందస్తు బెయిల్‌ కోసం ఖేరా దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఖేరాకు న్యాయస్థానంలో చుక్కెదురైంది.

Exit mobile version