Parliament Monsoon Session: కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు నేటి నుంచి బడ్జెట్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే, దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న నీట్- యూజీ పేపర్ లీకేజీ అంశం చర్చకు వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ అంశంపై మాట్లాడుతుండగా.. విపక్షాలు నిరసన తెలిపాయి. ప్రతిపక్ష పార్టీల ఎంపీల నినాదాలతో పార్లమెంట్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు, ఈ అంశంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమంటూ ఆరోపించారు. ఈ పేపర్ లీక్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనను తప్ప అందరిపై నిందలు వేస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: Gambhir-Jadeja: జడేజా అత్యంత కీలక ప్లేయర్.. అతడిని జట్టు నుంచి తప్పించలేదు: గంభీర్
అయితే, ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. గత ఏడేళ్లుగా పేపర్ లీక్ జరిగిన దాఖలాలు ఎక్కడా లేవు.. ఎన్టీఏ ఇప్పటి వరకు 240 పరీక్షలను సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది.. ప్రస్తుతం నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుందన్నారు. కాగా, మోడీ ప్రభుత్వం పేపర్ లీక్ల విషయంలో రికార్డు సృష్టిస్తుందని సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నంత కాలం స్టూడెంట్స్ కు న్యాయం దక్కదు అని అఖిలేశ్ యాదవ్ వెల్లడించారు. ఇదిలాఉంటే.. కన్వర్ యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన రూల్స్ ను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన నోటీసులను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తిరస్కరించారు.