Operation Sindoor: గతేడాది జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత వైమానిక రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన S-400 సిస్టమ్ మొత్తం యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించిందని, ఇవి ఎక్కడ మోహరించి ఉన్నాయనే వివరాలు కనుక్కోవడానికి పాకిస్తాన్ తన గూఢచారుల్ని, స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేసిందని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో వెస్ట్రన్ ఎయిర్ కమాండ్కు ఈయన నాయకత్వం వహించారు.
ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిశ్రా ఈ వివరాలను వెల్లడించారు. ఎస్-400 కారణంగా పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత సరిహద్దుకు 200 కిలోమీటర్ల పరిధిలోకి కూడా రాలేకపోయాయని తెలిపారు.
పాకిస్తాన్కు ముప్పుగా ఎస్-400 సుదర్శన చక్ర:
రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ‘‘సుదర్శన చక్ర’’గా అభివర్ణిస్తారు. ఇది ఉపరితలం నుంచి శత్రుదేశాలు ప్రయోగించే క్షిపణులు, విమానాలు, డ్రోన్లను గుర్తించి, అడ్డుకోగలదు. 2018లో భారత్, రష్యా నుంచి 5 ఎస్-400 సిస్టమ్స్ కోసం ఒప్పందం చేసుకుంది. ఇందులో మూడు వ్యవస్థలు భారత్కు అందాయి. ఇప్పుడు నాలుగో స్వ్కాడ్రన్ ఈ ఏడాది జూన్లో అందుతుంది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎస్-400లు ఎక్కడున్నాయో కనుక్కోవడానికి పాకిస్తాన్ తీవ్రంగా కష్టపడింది. గూఢచారులతో పాటు ఇతర దేశాల శాటిలైట్ సాయాన్ని కూడా తీసుకుందని మిశ్రా తెలిపారు. సిందూర్ సమయంలో పాకిస్తాన్కు చైనా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ అందించినట్లు వార్తలు ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ విమానాలు గగనతలంలోకి వస్తే ప్రతీసారి ఎస్-400 పరిధిలో లక్ష్యంగా మారాయి. దీంతోనే వీటి స్థానాలు కనుక్కోవడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది.
సైన్యానికి పూర్తిగా స్వేచ్ఛ:
పహల్గాం దాడి తర్వాత భారత సైన్యానికి దాడి విషయంలో ప్రభుత్వం పూర్తిగా స్వేచ్ఛనిచ్చినట్లు మిశ్రా చెప్పారు. అయితే పౌరుల ప్రాణాలకు నష్టం కలగకుండా, ఉగ్రవాదులు, వారి మద్దతుదారులనే లక్ష్యంగా చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఉగ్రవాదులు, వారి హ్యాండర్లను టార్గెట్ చేసుకున్నారు. మే 7న జైష్, లష్కర్కు చెందిన తొమ్మిది ఉగ్ర శిబిరాలపై భారత్ దాడులు చేసిన తర్వాతే పరిస్థితి ముగిసే అవకాశం ఉందని, అయితే పాకిస్థాన్ ఉద్రిక్తతలను పెంచిందని మిశ్రా తెలిపారు.
పాకిస్తాన్ ఆదంపూర్ ఎయిర్ స్టేషన్ లక్ష్యంగా 14-15 డ్రోన్లు ప్రయోగించిందని వీటిన్నింటిని భారత్ నిర్వీర్యం చేసిందని ఆయన తెలిపారు. అయితే, మే 9న పాకిస్తాన్ వందలాది డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిందన్నారు. పాకిస్తాన్ పౌర ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు, గురుద్వారాలను లక్ష్యంగా చేసుకున్నట్లు మిశ్రా ఆరోపించారు. దీంతో భారత్ ప్రతిదాడికి దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
పాకిస్తాన్ రాడార్లు ధ్వంసం:
భారత ఎయిర్ ఫోర్స్ మొదట పాకిస్తాన్ వైమానిక సామర్థ్యాలను ధ్వంసం చేసిందని మిశ్రా చెప్పారు. పంజాబ్లో ఉన్న అమెరికన్ AN/TPS సిరీస్ రాడార్లతో సహా పాకిస్థాన్కు చెందిన రాడార్లను ధ్వంసం చేశామని, రెండు కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు. దీంతో పాకిస్తాన్ ఒక రకంగా ‘‘చూపు’’ కోల్పోయినట్లు చెప్పారు. భూమిపై ఉన్న రాడార్లు ధ్వంసం కావడంతో పాకిస్తాన్ గగనతల నిఘా కోసం AWACS వంటి వైమానిక వ్యవస్థలపై ఆధారపడాల్సి వచ్చిందని మిశ్రా తెలిపారు.
సర్గోధాలో అవాక్స్ విమానాన్ని మోహరించగా, ఎస్-400 దానిని కూల్చివేసినట్లు వెల్లడించారు. ఎస్-400 ఆపరేటర్ అనుమతి కోరినప్పుడు తాను ‘‘షూట్’’ ఆదేశాలు ఇచ్చానని, దీంతో 341 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించిందని మిశ్రా చెప్పారు. ఇది సర్ఫెస్ టూ ఎయిర్ దాడుల్లో అత్యంత లాంగ్ రేంజ్ దాడుల్లో ఒకటిగా నిలించిందని వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్లో మహిళా ఫైటర్ పైలట్లు కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. లష్కరేతోయిబా మురిడ్కే కార్యాలయంతో పాటు మే 10న పాకిస్తాన్ ఎయిర్ బేస్లు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలపై దాడులు చేశారని చెప్పారు.

