Pakistan Air Strikes: రగిలిపోతున్న తాలిబన్లు.. పాక్ ఎయిర్ స్ట్రైక్స్‌లో 46 మంది మృతి..

  • ఆఫ్ఘన్‌పై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్..
  • 46 మంది మరణించినట్లు వెల్లడించిన తాలిబన్లు..
  • తప్పకుండా ప్రతీకారం ఉంటుందని హెచ్చరిక..
Pakistan Air Strikes

Pakistan Air Strikes

Pakistan Air Strikes: ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు సరిహద్దు ప్రావిన్స్‌లో జరిపిన దాడుల్లో 46 మంది మరణించారని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి, పాక్టికా ప్రావిన్స్‌లోని బర్మల్ జిల్లాలో పాకిస్తాన్ నాలుగు ప్రదేశాల్లో బాంబు దాడులు చేసింది. మరణించిన వారిలో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు. మరో ఆరుగురు గాయపడ్డారని, వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని చెప్పారు.

Read Also: Delhi: ఢిల్లీ అల్లర్ల నిందితుడి ఇంటికి ఎంఐఎం నేత.. ఎన్నికల్లో పోటీ చేస్తాడనే ప్రచారం..

పాకిస్తాన్ దాడుల్ని ఆఫ్ఘనిస్తాన్ ఖండించింది. దాడుల్ని అనాగరికం, స్పష్టమైన దురాక్రమణగా అభివర్ణించింది. ‘‘ఇస్లామిక్ ఎమిరేట్ ఈ పరికిపంద చర్యలకు సమాధానం తప్పకుండా ఇస్తుంది. సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడం హక్కుగా పరిగణిస్తుంది’’అని తాలిబాన్ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం నాటి దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మరణించినట్లు బర్మల్ నివాసి మలీల్ తెలిపారు.

2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ని చేజిక్కించుకున్న తర్వాత, పాక్ తాలిబన్లు పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో దాడులు చేస్తున్నారు. ఆఫ్ఘాన్ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)కి ఆశ్రయం ఇస్తుందని పాక్ ప్రధాన ఆరోపణ. ఇటీవల పాక్ తాలిబాన్లు ఆర్మీ ఔట్‌పోస్టుపై దాడి చేసి 16 మంది పాక్ ఆర్మీ జవాన్లను హతమార్చారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆఫ్ఘాన్‌పై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది.