NTV Telugu Site icon

Pahalgam Terror Attack: వెలుగులోకి ఉగ్రవాదుల దాడి దృశ్యాలు

Attack

Attack

పహల్గామ్ ఉగ్ర దాడికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఒక ఉగ్రవాది ఏకే-47 రైఫిల్‌తో చెలరేగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనాస్థలిలో ఒక ముష్కరుడు రైఫిల్‌తో ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. వెనుక నుంచి మొబైల్‌లో తీసిన ఫొటోలో బూడిద రంగు కుర్తా ధరించి.. చేతిలో ఏకే-47 రైఫిల్ పట్టుకుని ఉన్నాడు. దాడిలో పాల్గొన్న వ్యక్తుల్లో ఇతడొకడని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి.

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో దాదాపు 8-10 మంది ఉగ్రవాదులు పాల్గొనే అవకాశం ఉందని.. వీరిలో 5-7 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందినవారని అనుమానిస్తున్నట్లు సమాచారం. దాడి చేసింది తామేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ప్రకటించింది. ఈ ఉగ్రవాదులంతా కేవలం పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. మహిళలు, పిల్లల్ని ఏమి చేయలేదు. వారి జోలికి కూడా రాలేదు. ఒకవేళ అడ్డొచ్చినా.. ఏమీ చేయలేదు. ఇక ముస్లిమా? కాదా? అని వివరాలు అడిగి తెలుసుకున్నాకే కాల్చారు. ఐడీ కార్డులో పేరు చూసి మరీ కాల్చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

పర్యాటక కేంద్రమైన పహల్గామ్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో ఇద్దరు విదేశీయులు సహా 28 మంది మరణించారు. యూఏఈ, నేపాల్‌కు చెందిన ఇద్దరు విదేశీయులు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇక ఈ ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు అండగా ఉంటామని అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. ఇక సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. ఉగ్ర దాడి వార్త తెలుసుకున్న వెంటనే హుటాహుటినా భారత్‌కు బయల్దేరి వచ్చేశారు. బుధవారం అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అలాగే మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించనున్నారు.