Court Cases: దేశంలోని వివిధ కోర్టుల్లో కేసుల పేరుకుపోతోంది. కోట్లల్లో పెండింగ్ కేసుల సంఖ్య ఉంది. భారత న్యాయవ్యవస్థలో ఎప్పటికైనా న్యాయం లభిస్తుంది, కానీ దానికి కొంత సమయం పడుతుందని అంతా చెబుతుంటారు. కొన్ని కేసులు దశాబ్ధాలు పాటు కొనసాగుతుంటాయి. తాజాగా కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
దేశంలోని వివిధ కోర్టుల్లో 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని లోక్సభలో తెలిపారు. ఇందులో సుప్రీంకోర్టులో 80,000 కేసులు ఉన్నాయని తెలియజేశారు. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5,08,85,856 పెండింగ్లో ఉంటే.. వీటిలో 61 లక్షల కేసులు 25 హైకోర్టుల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 4.46 కోట్ల కేసులు నమోదయ్యాయని తెలిపారు.
భారత న్యాయవ్యవస్థలో మొత్తంగా 26,568 మంది న్యాయమూర్తులు ఉన్నారని, అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉండగా.. హైకోర్టుల్లో 1,114 మంది ఉన్నట్లు తెలిపారు. జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 25,420 మంది న్యాయమూర్తులు ఉన్నట్లు తెలిపారు.
