Bangladesh: ఉస్మాన్ హాది హంతకులు భారత్ పారిపోయారు: బంగ్లాదేశ్ పోలీసులు..

  • హాది హంతకులు భారత్ పారిపోయారు..
  • మేఘాలయా బార్డర్ గుండా భారత్‌లోకి..
  • నిందితులను అప్పగించేలా భారత్‌తో చర్చలు..
  • బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడి హత్యపై ఆ దేశ పోలీసులు..
Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌కు చెందిన రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నాయకుడు, భారత వ్యతిరేకి షరీఫ్ ఉస్మాన్ హాది హత్య ఆ దేశంలో హింసకు కారణమైంది. భారత్‌పై ఆరోపణలు నెడుతూ, అక్కడి మతోన్మాద మూక ఇండియన్ ఎంబసీపై కూడా దాడులకు పాల్పడింది. దైవదూషన ఆరోపణలపై అక్కడి మైనారిటీ హిందువులను హత్య చేసింది. ఇదిలా ఉంటే, హాది హత్యకేసులో ఇద్దరు ప్రధాన అనుమానితులు హత్య తర్వాత మేఘాలయ సరిహద్దు ద్వారా భారత్ పారిపోయారని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.

Read Also: Asif Ali Zardari: పాక్ వెన్నులో వణుకు పుట్టించిన ‘‘ఆపరేషన్ సిందూర్‘‘.. ఆ దేశ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..

విలేకరుల సమావేశంలో అదనపు కమిషనర్ SN నజ్రుల్ ఇస్లాం మాట్లాడుతూ, అనుమానితులైన ఫైసల్ కరీం మసూద్, అలంగీర్ షేక్ స్థానిక సహచరుల సహాయంతో మైమెన్‌సింగ్‌లోని హలువాఘాట్ సరిహద్దు ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారని అన్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం హలువాఘాట్ సరిహద్దు ద్వారా భారత్‌లోకి ప్రవేశించార, నిందితులను మొదటగా పూర్తి అనే వ్యక్తి రిసీవ్ చేసుకున్నాడని, సామి అనే టాక్సీ డ్రైవర్ వారిని మేఘాలయలోని తురా నగరానికి తరలించారని ఇస్లాం అన్నారు. అనుమానితులకు సాయం చేసిన ఇద్దరు వ్యక్తలను భారత అధికారులు అదుపలోకి తీసుకున్నారనే అనధికారిక నివేదికలు తమకు అందాయని చెప్పారు. నిందితుల్ని అరెస్ట్ చేసి అప్పగించేలా చూసేందుకు భారత్‌తో అన్ని మార్గాల్లో చర్చలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

ఈ నెలలో ఢాకాలో రిక్షాలో ప్రయాణిస్తున్న హాదిని ఇద్దరు వ్యక్తులు దగ్గర నుంచి కాల్చారు. తీవ్రగాయాలపాలైన హాదిని మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించగా, అక్కడే మరణించాడు. ఇతడి మరణం తర్వాత బంగ్లాలో అల్లర్లు చెలరేగాయి. గతేడాది షేక్ హసీనాను ప్రధాని పదవి నుంచి దించేందుకు కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్లో హాది ఒకరు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, ఈ ఎన్నికల్లో హాది పోటీ చేసేందుకు సిద్ధమైన తరుణంలోనే అతడి హత్య జరిగింది.