INDIA Bloc: రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షాలు

  • రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షాలు
  • తీర్మానానికి ఇండియా కూటమి పార్టీలు మద్దతు
  • 70 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లుగా కాంగ్రెస్ వెల్లడి
Rajya Sabha Chairman Dhankh

Rajya Sabha Chairman Dhankh

రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రాజ్యసభ ఛైర్మన్.. ప్రతిపక్షం పట్ల పక్షపాతం చూపిస్తున్నారని ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఆమ్ ఆద్మీ పార్టీ సహా ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. తీర్మానం ప్రవేశపెట్టేందుకు 50 మంది ఎంపీల మద్దతు ఉండాల్సి ఉండగా.. దాదాపు 70 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లుగా తెలుస్తోంది. రాజ్యసభ ఛైర్మన్‌పై ఇండియా కూటమి అధికారికంగా అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించిందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ఎక్స్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

సభ సెక్రటేరియట్‌కు కూటమి నేతలు నోటీసు అందించారు. రూల్‌బుక్ ప్రకారం.. ధన్‌కర్‌ను తొలగించే తీర్మానాన్ని సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. ప్రతిపక్షాలకు స్పష్టమైన మెజారిటీ లేనందున ఛైర్మన్ తొలగించే అవకాశం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి, వ్యాపారవేత్త జార్జ్ సోరోస్‌కు మధ్య సంబంధాలున్నాయనే ఆరోపణలతో సభలో గందరగోళం నెలకొంది. భారతీయ జనతా పార్టీ ఎంపీలు, విపక్ష సభ్యులు వాగ్వాదానికి దిగడంతో ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడిన కొద్దిసేపటికే అవిశ్వా తీర్మాన నోటీసు సమర్పించారు.