నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం జరిగింది. కదులుతున్న బస్సులో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం ఢిల్లీలో 40 కి.మీ దూరంలో వదిలేసి పరారయ్యారు. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఆగస్టు 4న గ్రేటర్ నోయిడాలో ఈ దారుణం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసులో నిందితులుగా ఉన్న బస్సు డ్రైవర్ కుల్దీప్ (39), కండక్టర్ సందీప్ (26)ను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర ఢిల్లీలోని తిమార్పూర్ ప్రాంతంలోని ఓ పార్కింగ్ స్థలం నుంచి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
బంధువుల ఇంటికి వెళ్తుండగా..
పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురికి చెందిన 16 ఏళ్ల బాలిక చదువుల విషయంలో తల్లి మందలించడంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా నోయిడాలోని తన బంధువు ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. భారీ వర్షం, చీకటి సమయంలో నోయిడాలోని పరి చౌక్ దగ్గర దిగింది. బంధువుల ఇంటికి చేరేందుకు చాలా సమయం పడుతుంది. అప్పటికే రాత్రి 9 గంటలు దాటింది. ఏదైనా వాహనం దొరుకుతుందేమోనని ఎదురుచూస్తోంది. గమ్యస్థానం చేరేందుకు ఇంకా సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అదే సమయంలో అటుగా వస్తున్న ఓ బస్సు ఆమె దగ్గర ఆపాడు. స్లీపర్ బస్సు కావడంతో లోపల ప్రయాణికులు ఎవరూ లేరు. బస్సులోకి ఎక్కిన బాలికకు తాము కూడా నోయిడా సెక్టార్-63 వైపు వెళ్తున్నామని కండక్టర్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమె బస్సులోకి ఎక్కింది. అయితే వాస్తవానికి ఆ బస్సు గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న వర్క్షాప్ నుంచి తిరిగి వస్తోంది. బస్సు కదలడం ప్రారంభమైన కొద్దిసేపటికే కండక్టర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం ఆమెపై నిందితులు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. ప్రతిఘటిస్తే చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు.
లైంగిక దాడి అనంతరం నిందితులు బాలికను ఢిల్లీలోని కశ్మీర్ గేట్ సమీపంలోని రింగ్ రోడ్ దగ్గర వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బస్సును స్వాధీనం చేసుకున్నారు. స్లీపర్ బస్సులోని బెర్త్లకు కర్టెన్లు ఉండటాన్ని నిందితులు తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సులో బాలికకు సంబంధించిన వెంట్రుకలను ఫోరెన్సిక్ బృందం గుర్తించింది. వాటిని ఆధారాలుగా సేకరించారు.
నిందితులు ఇద్దరూ విశ్వనాథ్ ట్రావెల్స్ అనే ప్రైవేట్ సంస్థలో రెండేళ్లకు పైగా పనిచేస్తున్నట్లు సంస్థకు చెందిన ఓ ఉద్యోగి వెల్లడించినట్లు సమాచారం. పోలీసులు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బస్సు ప్రయాణించిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా దర్యాప్తు అధికారులు సేకరించారు. వాటిని పరిశీలిస్తూ ఘటనకు సంబంధించిన మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. తాజా ఘటన దేశ రాజధాని ఢిల్లీలో 2012 నాటి నిర్భయ ఘటనను గుర్తుచేస్తోంది.

