సోషల్ మీడియాలో పోస్టులు.. వాటిపై పోలీసులు కేసులు పెట్టడంపై సీరియస్గా స్పందించింది సుప్రీంకోర్టు.. కరోనా వల్ల తాము పడుతున్న బాధలను సోషల్ మీడియాలో పంచుకుంటే.. పోలీసులు కేసులు పెడతారా? అని నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం.. ఇకపై సహించబోమని స్పష్టం చేసింది.. ఇకపై ఎవరైనా వేధిస్తే కోర్టు ఆదేశాల ధిక్కారంగా భావిస్తామని వ్యాఖ్యానించింది జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్.. ఒక వ్యక్తిగా, జడ్జిగా ఈ విషయం నాకు ఆందోళన కల్గిస్తోంది.. ఒక వ్యక్తి తన బాధను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తే… దానిని నిషేధించే ప్రయత్నం చేస్తారా…? ప్రజల ఆవేదనను వినండి అంటూ చురకలు అంటించారు.
ఎవరైనా వ్యక్తి తనకు ఆక్సిజన్ కావాలని, బెడ్ కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే… వారిని వేధించడం సరికాదని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. మనం ఇప్పుడు మానవ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని అన్నారు జస్టిస్ చంద్రచూడ్. కాగా, కరోనాతో ఇబ్బంది పడుతోన్న ఓ బాధితుడు.. ఇటీవల తనకు ఆక్సిజన్ కావాలని ట్వీట్ చేశాడు.. అయితే, దానిని ఓ ప్రముఖ జర్నలిస్ట్ రీ ట్వీట్ చేస్తే… ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారిపై కేసు పెట్టింది.. అంతే కాదు.. ఎవరైనా బెడ్ లేదని, ఆక్సిజన్ లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసు పెడతామని యూపీ సర్కార్ వార్నింగ్ ఇచ్చింది.. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.