Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన

Nitin Gadkari

Nitin Gadkari

Nitin Gadkari: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రతిపాదన చేశారు. ప్రైవేట్ ద్విచక్ర వాహన యజమానులు బైక్ ట్యాక్సీలుగా తమ వాహనాలను నడిపేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ బైక్‌లతో ప్రయాణికులను తరలించేందుకు అనుమతి ఉందని, అయితే కొన్ని రాష్ట్రాలు ఇంకా బైక్ ట్యాక్సీలకు అనుమతించడం లేదని తెలిపారు. బైక్ ట్యాక్సీ సేవలను ప్రోత్సహించడం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మందికి జీవనోపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని గడ్కరీ పేర్కొన్నారు. ముఖ్యంగా ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఇది అదనపు ఆదాయ వనరుగా మారుతుందని చెప్పారు. అయితే బైక్ ట్యాక్సీలకు అనుమతులు, బీమా, ఇతర నిబంధనలు ఆయా రాష్ట్రాల విధానాలపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.

రాష్ట్రాల నిర్ణయంపైనే అనుమతులు
రవాణా అంశం రాష్ట్రాల పరిధిలో ఉండటంతో బైక్ ట్యాక్సీలను అనుమతించాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయని గడ్కరీ తెలిపారు. కాబట్టి కేంద్ర మంత్రి సూచనతో దేశవ్యాప్తంగా వెంటనే బైక్ ట్యాక్సీలకు అనుమతి లభిస్తుందని భావించకూడదని స్పష్టం చేశారు.

ట్రాఫిక్ ఉల్లంఘనలకు నెగెటివ్ పాయింట్ సిస్టమ్
రోడ్డు భద్రతపై కూడా గడ్కరీ కీలక విషయాలు వెల్లడించారు. పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే డ్రైవర్లపై చర్యలు కఠినతరం చేసేందుకు మోటార్ వెహికల్స్ చట్టంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ప్రతి ఉల్లంఘనకు నెగెటివ్ పాయింట్లు కేటాయించే విధానాన్ని తీసుకురావచ్చని తెలిపారు. నిర్ణీత స్థాయికి పాయింట్లు చేరితే డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు గడ్కరీ..

డ్రైవర్ల ఆరోగ్యంపై ‘సురక్ష’ కార్యక్రమం
డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, హైవేలు, మైనింగ్ ప్రాజెక్టులతో సంబంధం ఉన్న ఇతర సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ అందించేందుకు ‘సురక్ష’ అనే పైలట్ కార్యక్రమాన్ని గడ్కరీ ప్రారంభించారు. తొలుత మహారాష్ట్రలోని నాగ్‌పూర్–కాంప్టీ NH-44లో 150 కిలోమీటర్ల పరిధి, చంద్రపూర్ మైనింగ్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. తొలి దశలో 10 వేల మందికి సేవలు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.

డ్రైవర్ల కంటి పరీక్షలు కీలకం
డ్రైవర్ల ఆరోగ్యం, ముఖ్యంగా కంటి చూపు పరీక్షలు రోడ్డు భద్రతకు ఎంతో కీలకమని గడ్కరీ అన్నారు. డ్రైవర్లకు సురక్షిత డ్రైవింగ్‌పై సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా భారీ వాహనాలు, నిర్మాణ పరికరాలు నడిపే వారికి తగిన శిక్షణ అందించేందుకు ప్రస్తుతం సరైన వ్యవస్థ లేదని పేర్కొన్నారు. డ్రైవింగ్ శిక్షణతో పాటు ఆరోగ్య పరీక్షలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ..