నేపాల్ విలయం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అకస్మాత్తుక వచ్చిన జలప్రళయంతో ఇంకొందరు తమ వారి జాడ తెలియక అల్లాడుతున్నారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 300కు చేరగా.. దాదాపు 1600 మంది వరకు గల్లంతయ్యారు. సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇదిలా ఉంటే నేపాల్ ప్రళయంలో మాజీ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శుభ్రాంశు రాయ్ భార్య శర్మిష్ట భౌమిక్ రాయ్ కూడా గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. ఆమె మాజీ రైల్వే మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత ముకుల్ రాయ్ కుమారుడు శుభ్రాంశు రాయ్ భార్య.
ఉత్తర 24 పరగణాల జిల్లాలో నివసించే శర్మిష్ట భౌమిక్ రాయ్.. ఆగస్టు 21న ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఏర్పాటు చేసిన టూర్లో భాగంగా నేపాల్కు వెళ్లారు. ఆమె ఒంటరిగానే ప్రయాణించినట్లు సమాచారం. ఆగస్టు 25 రాత్రి నుంచి భర్త శుభ్రాంశు రాయ్తో ఆమెకు ఎలాంటి సంబంధాలు లేకుండా పోయాయి. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కోల్కతా నుంచి కైలాష్-మానస సరోవర్ యాత్రకు బయలుదేరిన 32 మంది బృందం కూడా గల్లంతైన వారిలో ఉంది. ఈ బృందంలో 30 మంది పర్యాటకులు, ఇద్దరు టూర్ మేనేజర్లు ఉన్నారు. ఆగస్టు 21న కోల్కతా నుంచి బయలుదేరిన బృందం మరుసటి రోజు నేపాల్కు చేరుకుంది. బుధవారం ఉదయం ఈ బృందం నేపాల్-టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువాగఢికి చేరుకుంది. ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో అక్కడి ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో సభ్యులు ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాతే భారీ వరదలు సంభవించడంతో వారి నుంచి సంబంధాలు తెగిపోయాయి.
నేపాల్లోని మధ్య ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. పలు నివాస ప్రాంతాలు నీటమునిగాయి. వంతెనలు కొట్టుకుపోవడంతో పాటు జలవిద్యుత్ కేంద్రాలు సహా అనేక మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వందలాది మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 288 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.
భూకంపం తర్వాతే వరదలు?
నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 8.37 గంటలకు టిబెట్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. కేవలం మూడు నిమిషాల తర్వాతే ఆకస్మిక వరదలపై సమాచారం అందింది. ఈ భూకంపం కారణంగా హిమనదం నుంచి ఒక్కసారిగా భారీగా నీరు విడుదలై ఉండొచ్చని నేపాల్ అధికారులు అనుమానిస్తున్నారు. హిమనదంలోని నీరు అకస్మాత్తుగా ఉప్పొంగి బయటకు రావడాన్ని గ్లేసియల్ లేక్ ఔట్బర్స్ట్ ఫ్లడ్ (GLOF) అంటారు. ఇదే తరహాలో భారీగా నీరు, మంచు, శిథిలాలు దిగువ ప్రాంతాలకు దూసుకురావడంతో వరదలు సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
సహాయక చర్యలకు ఆటంకాలు
భారీ వరదల కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలకు చేరుకోవడం సహాయక బృందాలకు కష్టంగా మారింది. మరోవైపు కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా దెబ్బతినడంతో గల్లంతైన వారి కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ తెలుసుకోలేక ఆందోళన చెందుతున్నారు.

