Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..

  • వరదలకు భారత్, చైనా, అమెరికాలను నిందిస్తున్న నేపాల్..
  • కర్భన ఉద్గారాలు విడుదల వల్లే వరదలని వాదన..
  • పరిహారం చెల్లించాలని అంతర్జాతీయంగా కోరుతున్న నేపాల్..
Nepal Floods

Nepal Floods

Nepal Floods: నేపాల్ వరదలతో అతలాకుతలమైంది. వేయికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇప్పుడు నేపాల్ దీనిపై రాజకీయాన్ని ప్రారంభించింది. ఘోర వరదలపై ఆ దేశ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరిహారం కోరుతోంది. వరదలకు గ్రీన్ హౌజ్ ఉద్గారాలే కారణమని, ఇందులో భారత్, చైనా, అమెరికాల పాత్ర ఉందని, విపత్తు కారణంగా జరిగిన నష్టానికి క్లైమేట్ కాంపెన్సేషన్ ఇవ్వాలని నేపాల్ డిమాండ్ చేస్తోంది. ఆగస్టు 26న భోటేకోషి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన భారీ వరదలతో రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. ఇళ్లు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. నేపాల్ ప్రభుత్వం ఈ విపత్తును ‘హిమాలయన్ సునామీ’గా అభివర్ణించింది.

ఈ వరదల్లో ఇప్పటివరకు 1,127 మంది మరణించగా.. మరో 3,900 మంది ఆచూకీ గల్లంతయ్యారు. నేపాల్, చైనా సరిహద్దుల సమీపంలో కొండరాళ్లు విరిగి పడి వరదలకు కారణమైందని నిపుణులు భావిస్తున్నారు. ఈ విపత్తుపై నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా నష్టపోతున్న దేశాలకు, కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాలు పరిహారం చెల్లించాలని కోరారు. వరదల నష్టాన్ని కేవలం మానవతా సంక్షోభంగా చూడకుండా, వాతావరణ న్యాయం, పరిహారం కోణంలో చూడాలని నేపాల్ కోరుతోంది. ఇది దాతృత్వం కాదని, చట్టపరమైన, నైతిక బాధ్యత అని నేపాల్ తన వాదనని అంతర్జాతీయ స్థాయిలో వినిస్తోంది.

ప్రస్తుతం ప్రపంచంలో గ్రీన్ హౌజ్ ఉద్గారాలు విడుదల చేస్తున్న దేశాల్లో చైనా, అమెరికా, భారత్ అగ్రస్థానాల్లో ఉన్నాయని నేపాల్ వాదిస్తోంది. అయితే, తలసరి ఉద్గారాల విషయంలో భారత అభివృద్ధి చెందిన దేశాల కంటే చాలా తక్కువ స్థాయిలో ఉంది. వరదల నష్టాలపై తమ వాదనల్ని వినిపించేందుకు నేపాల్ ప్రధాని బాలెన్ షా ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వరదల వల్ల జరిగిన నష్టం, పునరావాసం, పునర్నిర్మాణం కోసం నేపాల్ ఐక్యరాజ్యసమితి మద్దతుతో పనిచేస్తున్న ‘ఫండ్ ఫర్ రెస్పాండింగ్ టు లాస్ అండ్ డ్యామేజ్’కు అధికారికంగా అభ్యర్థన పంపింది.