Nepal Floods: నేపాల్లో భోటెకోషి నది విపత్తులో 288 మంది భారతీయులు గల్లంతైనట్లు, 21 మందిని రక్షించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) గురువారం తెలిపింది. కైలాస మానస సరోవరన్ యాత్రకు వెళ్లిన యాత్రికులు, త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు గల్లంతైన వారి జాబితాలో ఉన్నారు. వీరిని గుర్తించేందుకు భారత ప్రభుత్వం నేపాల్ అధికారులతో కలిసి ప్రయత్నిస్తోందని చెప్పారు.
విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. త్రిశూలి-1 పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయులతో సంబంధాలు తెగిపోయినట్లు వెల్లడించారు. ఈ కార్మికుల కోసం కాఠ్మాండులోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపున్నట్లు తెలిపారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో అక్కడి వారిని సంప్రదించడం సవాలుగా మారినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన రెండు బృందాల్లోని 37 మంది, 49 మంది భారతీయుల ఆచూకీ కూడా అందుబాటులో లేదు. వీరు సమ్రాట్ ట్రావెల్స్, ఫ్లై ఎవరెస్ట్ ట్రావెల్స్ ద్వారా వేర్వేరుగా కైలాస యాత్రకు వెళ్లిరు. పశ్చిమ బెంగాల్కు చెందిన మరో 32 మంది భారతీయులు విపత్తు సంభవించిన రుసువా జిల్లాలోని టిమురే ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. రిచా టూర్స్ ద్వారా వెళ్లిన వివిధ రాష్ట్రాలకు చెందిన 61 మంది, కేరళకు చెందిన 33 మంది భారతీయులు ఆచూకీ కూడా ప్రస్తుతం దొరకలేదు. అయితే, వీరందరని కనుక్కోలేకపోతున్నామని, వారంతా గల్లంతయ్యారని అర్థం కాదని విదేశాంగ శాఖ చెప్పింది. మరోవైపు, తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయులను సురక్షితంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. గురువారం మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న సమాచారం ప్రకారం, ఈ సంఖ్య వెల్లడించారు.

