India-Nepal Border Dispute: భారత్-నేపాల్ మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 210 ఏళ్ల నాటి ‘‘సుగౌలి ఒప్పంద పత్రాలు’’ తమ వద్ద ఉన్నాయో లేవో ఖచ్చితంగా నిర్ధారించలేకపోతున్నామని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. 1816 సుగౌలి ఒప్పందం ఈ మొత్తం సరిహద్దు వివాదానికి కీలకంగా ఉంది. ఈ ఒప్పందం బ్రిటిష్ ఇండియా, నేపాల్ మధ్య సరిహద్దు నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నేపాల్ పార్లమెంటరీ విచారణ కమిటీ ఆర్కైవ్స్, ప్రభుత్వ శాఖలు, మ్యూజియాల్లో అన్వేషించినప్పటికీ ఈ ఒప్పంద అసలు పత్రాలు గుర్తించలేకపోయింది. ఈ విషయాన్ని నేపాల్ విదేశాంగ మత్రి శిశిర్ ఖనాల్ పార్లమెంట్లో చెప్పారు.
భుత్వం వద్ద అధికారిక సుగౌలీ ఒప్పందం అసలు పత్రం ఉందో లేదో ఖచ్చితంగా చెప్పలేమని తెలిపారు. నేషనల్ ఆర్కైవ్స్లో కొన్ని ఒప్పందాలకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని, కానీ అవే అసలు అధికారిక పత్రాలో కాదో నిర్ధారణ కాలేదని చెప్పారు. 1816 సుగౌలీ ఒప్పందం, 1950 భారత్-నేపాల్ శాంతి, స్నేహ ఒప్పందానికి సంబంధించిన అసలు పత్రాలు ఎక్కడ ఉన్నాయనేది నేపాల్లో సంచలనంగా మారింది. 2019లో అప్పటి నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తమ వద్ద రెండు ఒప్పందాల కాపీలు ఉన్నాయని చెప్పారు.
సుగౌలి ఒప్పందం ఏమిటి..?
1814-16 మధ్య జరిగిన ఆంగ్లో-నేపాల్ యుద్ధం తర్వాత సుగౌలీ ఒప్పందం కుదిరింది. 1815 డిసెంబర్లో దీనిపై సంతకాలు జరగగా, 1816 మార్చిలో ఇది అధికారికంగా ఆమోదించారు. ఈ ఒప్పందం ఆధునిక నేపాల్ భౌగోళిక సరిహద్దులకు పునాది వేసిన కీలక పత్రంగా పరిగణించబడుతోంది. భారత్-నేపాల్ సరిహద్దు వివాదంలో ఆర్టికల్ 5 అత్యంత ముఖ్యమైంది. దీని ప్రకారం కాళీ నది నేపాల్ పశ్చిమ సరిహద్దుగా పరిగణించబడుతోంది. అయితే, ఈ నది ఎక్కడ పుడుతుందనే దానిపై రెండు దేశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇదే వివాదానికి కారణంగా మారింది.
కాళీ నది ఎక్కడ పుడుతోంది.?
భారత్-నేపాల్ మధ్య కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా వివాదం ఉంది. ఈ ప్రాంతాలు తమవే అని నేపాల్ వాదిస్తోంది. భారత్ ఈ మూడు ప్రాంతాలు తమ భూభాగమని పలుమార్లు స్పష్టం చేసింది. నేపాల్ వాదన ప్రకారం, కాలీ నది లింపియాధురా వద్ద పుడుతోంది. దీనిని బట్టి చూస్తే ఈ మూడు ప్రాంతాలు కాళీ నదికి తూర్పున ఉంటాయి. దీని వల్ల ఈ భూభాగాలు తమవే అని నేపాల్ చెబుతోంది.
భారత వాదన ప్రకారం, కాళీ నది లిపులేఖ్ ప్రాంతానికి దిగువన స్ప్రింగ్స్లో నుంచి జన్మిస్తోంది. కాలాపానీ ప్రాంతాన్ని చారిత్రకంగా పిథోరాగఢ్ జిల్లాలో భాగంగా పరిగణించే పరిపాలనా, రెవెన్యూ రికార్డులను భారత్ ప్రస్తావిస్తోంది.ఇరు దేశాలు బ్రిటిష్ కాలం నాటి మ్యాపులు, చారిత్రక రికార్డుల్ని ఆధారాలుగా చూపిస్తు్న్నాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే కాళీ నది లింపియాధురాలోనే పుడుతుందని సుగౌలీ ఒప్పందంలో ఎక్కడా పేర్కొనలేదు.
2020లో ముదిరిన వివాదం:
2020లో భారత్ ఉత్తరాఖండ్ను లిపులేఖ్తో అనుసంధానించే 80 కిలోమీటర్ల రోడ్డును ప్రారంభించింది. ఇది కైలాస మానససరోవర్ యాత్ర మార్గంలో ఒక భాగం. అయితే, దీనిపై అప్పటి నేపాల్ లోని కేపీ శర్మ ఓలి ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఓలి ప్రభుత్వం లింపియాధురా, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలను కలుపుతూ కొత్త రాజకీయ మ్యాప్ను విడుదల చేసింది. ఈ మ్యాప్కు రాజ్యాంగ సవరణ ద్వారా నేపాల్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, భారత్ ఈ చర్యల్ని తిరస్కరించింది.

