National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!

  • దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి
  • జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
  • ఢిల్లీ నుంచి వేదిక తరలింపు
National Film Awards

National Film Awards

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఎప్పుడూ దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతుంటాయి. దశాబ్దాల నుంచి హస్తిన వేదికగానే జరుగుతుండేవి. ఇప్పుడు ఈ సంప్రదాయానికి స్వస్తి పలకబోతున్నారు. ఢిల్లీ నుంచి ఈ వేదిక మారిపోతుంది. తొలిసారి ఢిల్లీ దాటి వెళ్లిపోతుంది.

తొలిసారిగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల వేడుక న్యూఢిల్లీలో కాకుండా గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. స్టాట్యూ ఆఫ్ యూనిటీకి ప్రసిద్ధి చెందిన ఏక్తా నగర్.. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవానికి వేదిక కానున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల చివరిలో గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఏక్తా నగర్‌కు వెళ్లి 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను విజేతలకు అందించే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఎక్కువగా దేశ రాజధాని ఢిల్లీలోనే నిర్వహిస్తూ వచ్చారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. సంప్రదాయంగా రాష్ట్రపతి స్వయంగా విజేతలకు అవార్డులను అందజేస్తారు. ఈసారి గుజరాత్ వేదికగా అవార్డులు అందజేయనున్నట్లు సమాచారం.

ఎవరికి పురస్కారాలు?

72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈ ఏడాది జూలైలో న్యూఢిల్లీలో ప్రకటించారు. 2024లో విడుదలైన చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు. ‘ఆర్టికల్ 370’ చిత్రం ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. నటి యామీ గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఈ ఏడాది నాన్-ఫీచర్ విభాగంలో ‘Statue of Unity – Ekta Ka Prateek’ చిత్రానికి ఉత్తమ దర్శకత్వ అవార్డును దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ గెలుచుకున్నారు.

మొట్టమొదటి జాతీయ చలనచిత్ర పురస్కారాలను 1954లో ప్రదానం చేశారు. దశాబ్దాలుగా జరిగిన వేడుకలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా నిలిచింది. ఇప్పుడు 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక ఆ సంప్రదాయాన్ని వీడి.. తొలిసారిగా గుజరాత్‌లో జరగనుంది. ఎందుకంటే ఏక్తా నగర్‌లోనే దేశంలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో ఒకటైన స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అంకితం చేయబడిన 597 అడుగుల స్మారక చిహ్నమైన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ఐక్యతకు చిహ్నంగా ఉంది. ఈ ఉద్దేశంతోనే వేదిక మారుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చారిత్రక కట్టడాన్ని 2018లో ప్రధాని మోడీ ప్రారంభించారు.