Narendra Modi: పోఖ్రాన్ అణు పరీక్షపై మోదీ ట్వీట్… అటల్ జీ ధైర్యం చూపారంటూ..

Narendra Modi

Narendra Modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోఖ్రాన్ అణు పరీక్షపై ట్వీట్ చేశారు. నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా పోఖ్రాన్ అణు పరీక్షలను గుర్తు చేశారు. 1998లో నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్ష విజయవంతానికి కారణం అయిన శాస్త్రవేత్తలకు, వారి కృషికి థాంక్స్ చెప్పారు ప్రధాని మోదీ. శాస్త్రవేత్తల కృషి వల్లే 1998 అణు పరీక్షలు విజయవంతం అయ్యాయని ఆయన ట్వీట్ చేశారు. అప్పటి ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ధైర్యం చూపారంటూ.. అటల్ జీ నాయకత్వానికి గర్విస్తున్నామని ట్వీట్ చేశారు.

1998 అటల్ బీహారీ వాజ్ పేయ్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ‘ స్మైలింగ్ బుద్ధ’ పేరుతో 1998 మే 11-13 మధ్య అణు పరీక్షలు నిర్వహించారు. పాశ్చాత్య దేశాల నుంచి ఒత్తడి ఉన్నప్పటికీ… ముఖ్యంగా అమెరికా నుంచి ఇండియా అణు పరీక్షలు చేయవద్దనే ఒత్తడి ఉండేది. అయితే వీటన్నింటిని పక్కన పెట్టి వాజ్ పేయ్ అణు పరీక్షలు చేయాలనే సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారు. అత్యంత రహస్యంగా ఈ అణు పరీక్షలు నిర్వహించారు.

ఎప్పుడూ ఆకాశం నుంచి శాటిలైట్ల ద్వారా నిఘా ఉంచే అమెరికానే బోల్తా కొట్టించింది ఇండియా. కనీసం అణు పరీక్షలు నిర్వహిస్తున్నారని అమెరికా సీఐఏకు అనుమానం రాకుండా అత్యంత రహస్యంగా పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు జరిగిన తర్వాత కానీ అమెరికాకు ఈ విషయం తెలియదంటే… ఎంత రహస్యంగా ఈ పరీక్షలు జరిగాయో తెలుస్తోంది. అంతకు ముందు 1995లో పరీక్షలు నిర్వహించే సమయంలో సీఐఏ పసిగట్టడంతో సీక్రేట్ గా స్మైలింగ్ బుద్ధ ఆపరేషన్ చేశారు. రాజస్థాన్ లోని థార్ ఎడారి పోఖ్రాన్ ప్రాంతంలో ఈ అణుపరీక్షలు జరిగాయి. ప్రధాని వాజ్ పేయ్ తో పాటు అప్పటి డీఆర్డీఓ చీఫ్ గా ఉన్న డాక్టర్ అబ్దుల్ కలాం, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ( డీఏఈ) డైరెక్టర్ డాక్టర్ ఆర్. చిదంబరం కీలకంగా వ్యవహరించారు.