Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం

  • భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం
  • 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
  • తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు
Mumbai

Mumbai

ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్త్యం అయింది. రైల్వే స్టేషన్‌లో నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రస్తుతం మహారాష్ట్ర అంతటా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ముంబై, థానే, పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. థానేలో శనివారం ఓ ఆటోరిక్షాపై భారీ చెట్టు కూలిపోవడంతో డ్రైవర్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనలో 50 ఏళ్ల దినేష్ యాదవ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో ముంబైలో కేవలం 12 గంటల్లో సుమారు 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ముంబైకి భారీ వర్షాల హెచ్చరిక

భారత వాతావరణ శాఖ (IMD) జూలై 4 నుంచి 6 వరకు ముంబైతో పాటు రాయగడ్, థానే, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే మధ్య మహారాష్ట్రలోని సతారా, పుణె, నాసిక్ ఘాట్ ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా రవాణా అంతరాయం, చెట్లు కూలడం, బలహీన నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, ఘాట్ రోడ్లలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

50-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు

రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రజలకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని కోరింది. తదుపరి 24 గంటల్లో ముంబై, పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం రుతుపవనాల ప్రభావం బలహీనంగానే ఉన్నప్పటికీ ఆదివారం నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. శనివారం కోసం ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

ఎందుకు ఆలస్యమైంది?

స్కైమెట్ వెదర్ అధ్యక్షుడు మహేశ్ పలావత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మధ్య భారతదేశంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా తేమ ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమైందని తెలిపారు. ‘‘జూలై 5, 6 నాటికి ఈ వ్యవస్థ బలహీనపడిన తర్వాత ఢిల్లీలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది’’ అని వివరించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆదివారం ఉదయం ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం లేదా రాత్రి మరోసారి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం, మంగళవారం కూడా మేఘావృత వాతావరణం కొనసాగుతూ మధ్య మధ్యలో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.