NTV Telugu Site icon

Mumbai metro: ముంబైకు తొలి అండర్ గ్రౌండ్ మెట్రో.. ప్రారంభం ఎప్పుడంటే..!

Mumbaimetro

Mumbaimetro

ఆర్థిక రాజధాని ముంబైలో మరో అద్భుతమైన ప్రాజెక్ట్ ఆవిష్కృతం కాబోతుంది. నగరానికే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. మొట్టమొదటిసారిగా భూగర్భంలోంచి మెట్రో రైలు వెళ్లేలా ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పూనుకుంది. ఈ పనులు పూర్తి కావడంతో లాంచింగ్‌కు రెడీ అయింది. ఈనెల 24న అండర్ గ్రౌండ్ మెట్రో రైలు ప్రారంభం కాబోతున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే బుధవారం తెలిపారు. ప్రధాని మోడీ హామీ మేరకు ముంబై వాసుల కల నెరవేరబోతుందని ఆయన పేర్కొన్నారు.

దాదాపు 33.5 కిలోమీటర్ల మేర భూగర్భ మెట్రో కోసం రూ.23.136 కోట్ల అంచనాతో ప్రాజెక్ట్ చేపట్టారు. ప్రతీ రోజూ 1.7 మిలియన్ల ప్రయాణికులకు ఈ మెట్రో లైన్ సేవలందించనుంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంతో రవాణా వేగం పుంజుకుంటుందని బీజేపీ నేత వినోద్ తావ్డే ఎక్స్ వేదికగా వెల్లడించారు.

33.5 కిలోమీటర్ల భూగర్భ మెట్రో మార్గంలో ఆరే కాలనీ, SEEPZ, MIDC, మరోల్ నాకా, CSMIA T2, సహర్ రోడ్, CSMIA T1, శాంతాక్రూజ్, విద్యానగరి, BKC, ధారవి, శిట్లదేవి ఆలయం, దాదర్, సిద్ధివినాయక్ ఆలయం, వర్లి, ఆచార్య ఆత్రే చౌక్, సైన్స్ మ్యూజియం దగ్గర స్టాప్‌లు ఉంటాయి. మహాలక్ష్మి, ముంబై సెంట్రల్, గ్రాంట్ రోడ్, గిర్గావ్, కల్బాదేవి, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, హుతాత్మా చౌక్, చర్చిగేట్, విధాన్ భవన్, కఫ్ పరేడ్ రూట్‌లో రైలు పరుగులు పెట్టనుంది. ఇప్పటికే ట్రయల్స్ పూర్తయ్యాయి. త్వరలోనే కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (CMRS) తనిఖీ నిర్వహించనున్నారు.

మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.23,136 కోట్లు. నిధులలో ఎక్కువ భాగం జపాన్‌దే. 57.2 శాతం నిధులు ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) ODA రుణం రూ. 13,235 కోట్లుగా ఉంది. ఇక 30 సంవత్సరాల్లో రీపేమెంట్ వ్యవధి ఉంది. ప్రాజెక్ట్ కోసం 1.15 శాతం వడ్డీ రేటు కూడా ఉంది. ఇక కొత్త లైన్ యొక్క ప్రత్యేకతలు నిరంతర మొబైల్ సేవ ఉంది. ఒక్కో రైలుకు 3,000 మంది ప్రయాణీకులు జర్నీ చేసే సామర్థ్యం కల్పించారు.