ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాల కారణంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. చెంబూర్ ప్రాంతంలో స్కూల్ వ్యాన్పై భారీ రావి చెట్టు కూలిపోవడంతో 11 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనలో మరికొందరు విద్యార్థులు గాయపడగా.. వారిని సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం చెంబూర్లోని రోడ్ నెం.11 దగ్గర ఈ ప్రమాదం జరిగింది. యూనివర్సల్ హై స్కూల్కు చెందిన వ్యాన్లో విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తుండగా.. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ఒక భారీ చెట్టు ఒక్కసారిగా వేరుతో సహా కూలి వ్యాన్పై పడింది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్లో మొత్తం 12 మంది విద్యార్థులు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
ముంబై ఎం-వెస్ట్ వార్డు అసిస్టెంట్ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం అనంతరం 12 మంది విద్యార్థులను వెంటనే బయటకు తీశారు. అయితే ఒక విద్యార్థి వ్యాన్లో ఇరుక్కుపోవడంతో అతడిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాయి. అనంతరం అతడిని బయటకు తీసే సరికి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ముంబై ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సిబ్బంది, అత్యవసర వైద్య బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన విద్యార్థులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో చెంబూర్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

