MOTN Survey: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబించే ‘‘మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN)’’ ఆగస్టు 2026 ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 326 సీట్లతో అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. మరోవైపు, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే, ప్రశ్నాపత్రాల లీకేజ్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలపై యువత అసంతృప్తిగా ఉన్నప్పటికీ, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వం వైపే యువత ,జెన్-జీ ఉన్నట్లు తెలిపింది.
ఇటీవల ప్రశ్నాపత్రాల లీకులు, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం నేపథ్యంలో ఈ సర్వే కీలక విసయాలను వెల్లడించింది. . పరీక్షల నిష్పాక్షికతపై 40 శాతం మంది యువతకు నమ్మకం లేదని, మరో 27 శాతం మంది ఈ వ్యవస్థపై చాలా తక్కువ నమ్మకం ఉందని తెలిపారు. మొత్తంగా 67 శాతం మంది యువత పరీక్షా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేయగా, కేవలం 14 శాతం మంది మాత్రమే అది పూర్తిగా నిష్పాక్షికంగా ఉందని భావించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతోందని, నమ్మదగినదిగా లేదని 17 శాతం జెన్-జీ యువత అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యంపై ప్రశ్నించగా.. రిగ్గింగ్, అవినీతిని అరికట్టడంలో విఫలమవడమే ప్రధాన కారణమని 9.8 శాతం మంది చెప్పారు. గత సర్వేలో ఈ అభిప్రాయం కేవలం 1.4 శాతంగా ఉండటం గమనార్హం.
నిరుద్యోగంపై యువతలో ఆగ్రహం..
ప్రశ్నాపత్రాల లీకేజీలపై ఉన్న ఆగ్రహానికి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తోడైనట్లు సర్వే వెలఅ్లడించింది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా 22.7 శాతం మంది నిరుద్యోగాన్ని పేర్కొన్నారు. నిరుద్యోగ పరిస్థితి చాలా తీవ్రమైందిగా 42.3 శాతం, మరో 23.8 శాతం తీవ్రమైందిగా పేర్కొన్నారు. బీజేపీ కూటమి ప్రభుత్వంలో 23 శాతం ద్రవ్యోల్బణం, 15.9 శాతం మంది నిరుద్యోగాన్ని అతిపెద్ద వైఫల్యాలుగా చెప్పారు. రోజూ వారీ ఖర్చులు గతేడాదితో పోలిస్తే కష్టంగా మారిందని 65 శాతం మంది చెప్పారు.
సీజేపీకి షాక్..
పేపర్ లీక్లకు వ్యతిరేకంగా, విద్య కోసం, జెన్-జీ కోసం పోరాడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి ప్రజలు షాక్ ఇచ్చారు. 39 శాతం మంది యువత అది ‘ప్రెజర్ గ్రూపు’’గానే పనిచేయాలని, రాజకీయ పార్టీగా మారకూడదని చెప్పారు. ఒక వేళ సీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటు వేస్తారా అనే ప్రశ్నకు 43 శాతం మంది నిరాకరించగా, 33 శాతం మంది మద్దతు తెలిపారు.
సమస్యలు ఉన్నా మోడీకే మద్దతు..
ఇలాంటి ఆందోళనలు ఉన్నప్పటికీ ఇప్పటికీ దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన రాజకీయ నాయకుడిగా ప్రధాని నరేంద్రమోడీ ఉన్నారు. 48.7 శాతం మంది ప్రజలు ఇప్పటికీ నరేంద్ర మోదీని తదుపరి ప్రధానమంత్రిగా తమ మొదటి ఎంపికగా భావిస్తుండగా, 27.1 శాతంతో రాహుల్ గాంధీ రెండవ స్థానంలో ఉన్నారు. సర్వకాలీన ఉత్తమ ప్రధానమంత్రి రేసులో కూడా 41.1 శాతంతో నరేంద్ర మోదీ ముందంజలో ఉన్నారు. 51.3 శాతం మంది ప్రజలు ప్రధానమంత్రి వ్యక్తిగత పనితీరును అద్భుతం పనిచేశారని అభిప్రాయపడ్డారు. యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC)కి 75.0 శాతం, చొరబాట్ల నియంత్రణకు 76.2 శాతం, ఒకే దేశం ఒకే ఎన్నికకు 70.4 శాతం, కఠినమైన ఫిరాయింపుల నిరోధక చట్టానికి 64.4 శాతం మద్దతు లభించింది. అంతేకాకుండా, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే దార్శనికత పట్ల దేశంలో 57.6 శాతం మంది ఉత్సాహంగా ఉన్నారు. మొత్తం మీద ఎన్డీయే ప్రభుత్వ పనితీరుకు 50.4 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.
బీజేపీకి సవాళ్లు..
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు అనుకూలతలు ఉన్నప్పటికీ, సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. దేశ ప్రజాస్వామ్య పరిస్థితి ప్రమాదంలో ఉందని 46.7 శాతం మంది భావిస్తుండగా, 41.6 శాతం దీనితో విభేదించారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై 40.9 శాతం మంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిరంలో జరిగిన దొంగతనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టను దెబ్బతీసిందని 46.6 శాతం మంది అభిప్రాయపడ్డారు. E20 పెట్రోల్ మార్పులకు 58 శాతం మంది మద్దతు తెలిపారు. మత సామరస్యం పరిస్థితి మెరుగుపడిందని 34 శాతం మంది మాత్రమే భావించగా, 29.5 శాతం మంది పరిస్థితి దిగజారిందని చెప్పారు.

