Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!

  • ‘‘మూడ్ ఆఫ్ ది నేషన్’’ సర్వేలో విజయ్ సంచలనం..
  • ప్రధాని రేసులో మూడో స్థానం..
  • మోడీ, రాహుల్ తర్వాత ప్రధానిగా విజయ్‌కే మద్దతు..
  • సీఎం అయిన 3 నెలలకే జాతీయంగా విజయ్ క్రేజ్..
Vijay

Vijay

Mood of the Nation:  తాజా విడుదలైన మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN)లో మరోసారి ప్రజలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకే పట్టం కట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 326 సీట్లతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేసింది. జనవరిలో నిర్వహించిన గత సర్వేలో ఎన్డీయేకు 352 సీట్లు వస్తాయని అంచనా వేయగా, తాజా సర్వేలో 26 సీట్లు తగ్గాయి. అయినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్‌ను దాటి మెరుగైన సీట్లను సాధిస్తుందని చెప్పింది.మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సీట్లలో పెద్దగా మార్పు కనిపించలేదు. తాజా సర్వేలో ఇండియా కూటమికి 185 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. జనవరి 2026 MOTN సర్వేలో ఈ సంఖ్య 182గా ఉంది.

తొలిస్థానంలో మోడీ, 3వ స్థానంలో విజయ్..

ఇదిలా ఉంటే, ప్రధానిమంత్రి ఎవరనే దానికి మరోసారి ప్రజలు నరేంద్ర మోడీ వైపు మద్దతు ప్రకటించారు. ఏకంగా 48.7 శాతం మంది మోడీకి మద్దతు తెలిపారు. రాహుల్ గాంధీ రెండో స్థానంలో ఉన్నప్పటికీ మోడీకి చాలా దూరంలో 27.1 శాతంతో ఉన్నారు. మూడో స్థానంలో అనూహ్యంగా తమిళనాడు సీఎం విజయ్ ఉండటం గమనార్హం. టీవీకే అనే పార్టీని ప్రారంభించిన కొన్ని నెలల్లోనే తమిళనాడులో అధికారాన్ని చేపట్టిన తలపతి విజయ్ ప్రధాని కావాలని 9.2 శాతం మంది మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఏడాది పూర్తికాకముందే ప్రధాని అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

వరసగా మోడీ, రాహుల్ గాంధీ, విజయ్ తొలి మూడు స్థానాల్లో కొనసాగుతుండగా నాలుగో స్థానంలో మమతా బెనర్జీ 2 శాతం, అఖిలేష్ యాదవ్ 1.7 శాతం, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే 1.3 శాతం, అరవింద్ కేజ్రీవాల్ 1.2 శాతంతో వరసగా ప్రధాని రేసులో ఉన్నారు.

ప్రతిపక్ష నేతగా రాహుల్ తర్వాత విజయ్..

ఇదే కాకుండా ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించే నేతల్లోనూ విజయ్ సంచలనం సృష్టించారు. ప్రతిపక్ష నాయకుడి రాహుల్ గాంధీ తొలిస్థానంలో 29 శాతం మద్దతుతో ఉంటే, రెండో స్థానంలో విజయ్ 12.2 శాతంతో ఉన్నారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్‌లు వరసగా 8.5, 7.5, 6.9 శాతం మద్దతులో తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ప్రధాని అభ్యర్థిగా టీవీకే ప్రచారం..

పార్టీ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే తమిళనాడు సీఎంగా గెలిచి, రాజకీయ రంగంలోనే చరిత్ర సృష్టించారు విజయ్. ఇప్పుడు 2029 ప్రధాని అభ్యర్థిగా విజయ్‌ను టీవీకే ప్రొజెక్ట్ చేస్తోంది. ఇటీవల టీవీకే మంత్రి శరత్ కుమార్ తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ.. భారతదేశ తదుపరి ప్రధానిగా విజయ్‌ను అభివర్ణించారు. మరో మంత్రి ఆధవ్ అర్జున కూడా దక్షిణ భారతదేశం నుంచి ఒక ప్రధాని రావాలని, ఆ నాయకుడు తమిళనాడు నుంచే రావాలని అన్నారు.