Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!

  • కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ
  • కులాల కోసం ‘డ్రాప్‌డౌన్’ ఏర్పాటు చేయాలని వినతి
Rahulgandhi6

Rahulgandhi6

కులగణన ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కులగణనలో వెనుకబడిన తరగతుల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక కాలమ్ లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంయుక్తంగా లేఖ రాశారు.

కులగణనను నిర్వహించడం మాత్రమే కాకుండా.. దానిని సరైన పద్ధతిలో నిర్వహించడం అత్యంత ముఖ్యమని ఖర్గే సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న కుల వివరాల నమోదు విధానం తప్పుదోవ పట్టించేలా ఉందని రాహుల్ గాంధీ, ఖర్గే ఆరోపించారు.

ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలో వ్యక్తులు తమ కులం పేరును ఏ విధంగా చెబితే.. అదే పేరును నమోదు చేస్తారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒకే కులాన్ని వేర్వేరు పేర్లు, ఉపకులాలు, భాషల్లో పిలుస్తారని తెలిపారు. ఒకే కులానికి చెందిన వ్యక్తుల వివరాలు వేర్వేరు పేర్లతో నమోదైతే.. ఆ కులం వేలాది పేర్లుగా విడిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా లక్షల సంఖ్యలో కులాల పేర్లతో జాబితా తయారై.. కులగణన ద్వారా సేకరించిన మొత్తం డేటా ప్రయోజనం లేకుండా పోయే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న కులగణన ప్రశ్నావళిని రద్దు చేసి.. రాజకీయ పార్టీలు, నిపుణులు, ప్రజలతో సంప్రదింపులు జరిపిన అనంతరం కొత్త ప్రశ్నావళిని రూపొందించాలని రాహుల్ గాంధీ, ఖర్గే డిమాండ్ చేశారు. ప్రతి కులం, సమాజానికి చెందిన జనాభాను కచ్చితంగా లెక్కించేలా విధానం ఉండాలని కోరారు.

కులాల కోసం ‘డ్రాప్‌డౌన్’ జాబితా ఏర్పాటు చేయాలని సూచించారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఇప్పటికే ఉన్న ప్రభుత్వ జాబితాలు, ఆంత్రోపలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డేటా ఆధారంగా ఈ జాబితాను సులభంగా రూపొందించవచ్చని తెలిపారు. తెలంగాణ, బీహార్‌లో నిర్వహించిన సర్వేల్లో ఇదే తరహా విధానాన్ని అనుసరించినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కులాల జాబితాలను కూడా తమ లేఖకు జత చేశారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కులగణన నిర్వహించాలనే నిజమైన ఉద్దేశం కేంద్రానికి లేదని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితిని “మోసం”గా అభివర్ణిస్తూ.. కులగణనను కావాలనే పక్కన పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రెండు వారాల క్రితం కేంద్ర ప్రభుత్వం 2027 జనగణనకు సంబంధించి 40 ప్రశ్నలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో 10వ ప్రశ్న కులానికి సంబంధించినది. ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం డ్రాప్‌డౌన్ జాబితాను ఏర్పాటు చేయగా.. ఇతర కులాల వివరాల కోసం ఓపెన్ ఎండెడ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇతర వెనుకబడిన తరగతుల కోసం కూడా డ్రాప్‌డౌన్ జాబితాను చేర్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. “Gen Z విద్యార్థుల మాదిరిగా OBC వర్గాలు కూడా రోడ్లపైకి వస్తే.. ప్రభుత్వం దిగిరాక తప్పదు” అని వ్యాఖ్యానించారు. తాజాగా కులగణన విధానంపై ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ, ఖర్గే లేఖ రాయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.