Marco Rubio: భార్యతో కలిసి జైపూర్ ప్రసిద్ధ కట్టడాలు సందర్శించిన మార్కో రూబియో

  • భారత్‌లో కొనసాగుతోన్న మార్కో రూబియో పర్యటన
  • సోమవారం ఉదయం తాజ్‌మహల్ సందర్శన
  • అనంతరం జైపూర్‌లో ప్రసిద్ధ కట్టడాలు పరిశీలన
Marco Rubio

Marco Rubio

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యటన భారత్‌లో కొనసాగుతోంది. నాలుగు రోజుల పర్యటన కోసం శనివారం కోల్‌కతాకు వచ్చారు. ఛారిటీ ఆఫ్ మిషనరీస్‌ను సందర్శించిన అనంతరం ఢిల్లీకి చేరుకుని ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలపై చర్చించారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో కూడా సమావేశం అయ్యారు.

ఇక సోమవారం భారతదేశంలోని చారిత్రాత్మక కట్టడాల సందర్శనకు వెళ్లారు. ఈ ఉదయం ఆగ్రాలోని తాజ్‌మహాల్‌ను సందర్శించారు. దాదాపు గంటన్నర పాటు గడిపారు. అనంతరం దంపతులు సందర్శకుల పుస్తకంలో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా తాజ్‌మహల్‌ను ప్రపంచంలోని నిజమైన అద్భుత సంపదల్లో ఒకటిగా అభివర్ణించారు. అలాగే భారత్‌లో అమెరికా రాయబారి అయిన సెర్గియా గోర్ కూడా భారతదేశపు అద్భుత వారసత్వం,. శిల్పకళకు ప్రతీకగా తాజ్‌మహల్‌ను కొనియాడారు. మార్కో రూబియోతోనే సెర్గియా గోర్ కలియ తిరిగారు.

అనంతరం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రసిద్ధ కట్టడాలను భార్య జీనెట్ రూబియోతో కలిసి సందర్శించారు. ఆమేర్ కోట‌లో కలియ తిరిగారు. అంతక ముందు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దివ్య కుమారి స్వాగతం పలికారు. కట్టడాల గురించి గైడ్ వివరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మంగళవారం ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రతా పరిస్థితులు, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రధాన చర్చాంశాలుగా ఉండనున్నాయి.

ఇదిలా ఉంటే గతంలో పలువురు అమెరికా ప్రముఖులు కూడా తాజ్‌మహల్‌ను సందర్శించారు. గత ఏడాది అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన కుటుంబంతో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించగా.. ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి పర్యటించి భారతీయ సంస్కృతికి ఇది చిరస్థాయి చిహ్నమని పేర్కొన్నారు. అలాగే జేడీ వాన్స్ కుటుంబం కూడా తాజ్‌మహల్ అద్భుత కట్టడం అని అభివర్ణించారు.