Manipur: మణిపూర్‌లో ఏఎస్పీ కిడ్నాప్‌.. పోలీసులు ఏం చేశారంటే..!

Guns

Guns

మణిపూర్‌లో గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అలాంటి వాతావరణమే కొనసాగుతోంది. మంగళవారం రాత్రి పశ్చిమ ఇంఫాల్‌లోని అదనపు ఎస్పీ అమిత్‌సింగ్‌ ఇంటిపై సుమారు 200 మంది సాయుధులు దాడి చేసి ఆయనతో పాటు మరొకరిని అపహరించుకుపోయారు. ఈ ఘటనతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

ఈ పరిణామంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జల్లెడ పట్టాయి. మొత్తానికి గంటల వ్యవధిలోనే ఏఎస్పీని విడిపించుకుని తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనపై పోలీస్ కమాండోలు వినూత్న నిరసనకు దిగారు. బుధవారం ఆయుధాలు విడిచిపెట్టి విధులకు హాజరయ్యారు.

అసలేం జరిగిందంటే..
వాహనం ఎత్తుకెళ్లారన్న ఆరోపణలతో అరంబై టెంగోల్‌ గ్రూప్‌నకు చెందిన ఆరుగురు వ్యక్తులను ఏఎస్పీ అమిత్‌ అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన ఆ వర్గం వారిని విడిచిపెట్టాలని డిమాండ్‌ చేస్తూ దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ క్రమంలోనే ఏఎస్పీని అపహరించుకుని వెళ్లారని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.