Site icon NTV Telugu

Delhi: షోరూమ్‌ ఫస్ట్‌ఫ్లోర్‌లో నిమ్మకాయ తొక్కిస్తుండగా కిందపడ్డ ఖరీదైన కారు.. ఆ తర్వాత ఏమైందంటే..!

Delhicar

Delhicar

ఓ యువతి ఎంతో ముచ్చటగా కొత్త కారు కొనుక్కుంది. కారుకు సంబంధించిన అన్ని లెక్కలు పూర్తయ్యాక.. సిబ్బంది కారు తాళాలు అందజేశారు. అయితే షోరూమ్‌ లోపలే సాంప్రదాయ పూజ నిర్వహించింది. ఇందులో భాగంగా టైర్ కింద నిమ్మకాయ తొక్కుతుండగా సడన్‌గా ఒక్కసారిగా యాక్సిలరేటర్‌ ఇచ్చింది. అంతే మొదటి అంతస్తు నుంచి కారు కింద పడిపోయింది. 15 అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: PM Modi: ట్రంప్‌తో మాట్లాడేందుకు నేను రెడీ.. ఎక్స్‌లో మోడీ రిప్లై

ఘజియాబాద్‌కు చెందిన 29 ఏళ్ల మాని పవార్ అనే మహిళ.. తన భర్త ప్రదీప్‌తో కలిసి ఢిల్లీలోని నిర్మాణ్ విహార్‌లోని కారు షోరూమ్‌కు సోమవారం సాయంత్రం 5గంటలకు వచ్చింది. అనంతరం రూ.27 లక్షల ఖరీదైన మహీంద్రా థార్‌ను కొనుగోలు చేసింది. అయితే షోరూమ్ లోపలే పూజ నిర్వహించింది. అనంతరం టైర్ నిమ్మకాయ తొక్కించడానికి డ్రైవింగ్ సీటులో కూర్చుంది. కారు స్టార్ట్ చేసి యాక్సిలరేటర్‌ మీద కాలు వేసి బలంగా తొక్కింది. అంతే వెంటనే గాజు గోడను దూసుకుని కింద పడిపోయింది. 15 అడుగుల ఎత్తు నుంచి తల్లకిందులుగా కారు పడిపోయింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం సమీపంలోని మాలిక్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదులు నమోదు కాలేదని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు) అభిషేక్ ధనియా తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇలాంటి తప్పులు మరొకరు చేయొద్దని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇది కూడా చదవండి: UPI Transaction Limits: యూపీఐ లావాదేవీలపై పరిమితులను సవరించిన NPCI

 

Exit mobile version