Tamil Nadu: ఆలయ నిధులను ఉపయోగించి కళ్యాణ మండపాలను నిర్మించడానికి అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కొట్టివేసింది. ఆ నిధులను ప్రభుత్వం ఉపయోగించడానికి అవకాశం లేదని తేల్చి చెప్పింది. భక్తులు సమర్పించిన హుండీ నిధులు, దాతలు ఇచ్చిన ఆస్తులు అన్నీ దేవుడికే చెందుతాయి, దేవుడే వాటి యజమాని అని జస్టిస్ ఎస్ఎం. సుబ్రమణ్యం, జస్టిస్ జీ. అరుళ్ మురుగన్ లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఇక, దేవాలయాలు లాభాపేక్షలేని సంస్థలు కాబట్టి, వాటి నిధులను హిందూ మత, దాతవ్య చట్టం (HR & CE Act)లో పేర్కొన్న పరిమితుల మేరకే వినియోగించాలంటూ తీర్పునె వెలువరించింది.
అయితే, ఈ చట్టం ప్రభుత్వానికి హిందూ మత సంస్థలను పర్యవేక్షించే అధికారం ఇచ్చినప్పటికీ.. భక్తులు లేదా దాతలు అందజేసిన నిధులు, ఆస్తులను ఆలయ ఉత్సవాలు, దేవాలయాల అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని సూచించింది. అంతేగాని, మతేతర కార్యకలాపాలకు ఉపయోగించరాదు.. ఒకవేళా అలా చేస్తే, హిందువుల మత స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కాగా, HR & CE మంత్రి పీకే శేఖర్ బాబు అసెంబ్లీలో 27 దేవాలయాల్లో రూ.80 కోట్ల వ్యయంతో పెళ్లి మండపాలు నిర్మించనున్నట్లు ప్రకటించిన విషయాన్ని కూడా మద్రాస్ హైకోర్టు ప్రస్తావించింది. ఆ ప్రకటనను దృష్టిలో పెట్టుకుని, ఈ నిధుల మళ్లింపును నిలిపివేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది.
