దేశంలో రోజురోజుకు మహిళలపై ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా అబలలకు మాత్రం రక్షణ కరవుతోంది. మొన్నటికి మొన్న గురుగ్రామ్లో ఓ మహిళా బైకర్ను ఓ మృగాడు కారుతో ఢీకొట్టి పరారయ్యాడు. ఈ ఘటనలో బాధితురాలు స్వల్ప గాయాలతో బయటపడింది. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి. ఈ ఘటనను దేశ ప్రజలు ఇంకా మరిచిపోక ముందే ఉత్తరప్రదేశ్లోని లక్నోలో మరో దుర్మా్ర్గం జరిగింది. ఓ యువతిని కారు ఢీకొట్టి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలపై మహిళా లోకం ఆందోళనకు గురవుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో గోమతీనగర్లోని జనేశ్వర్ మిశ్రా పార్క్ సమీపంలో ఓ యువతిని కారు ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన షహన్వాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని, అతడి కారును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జనేశ్వర్ మిశ్రా పార్క్ గేట్ నంబర్ 4 సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపించారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు షహన్వాజ్, బాధితురాలు దాదాపు ఏడాది కాలంగా ఒకరికొకరు పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్క్ సమీపంలో షహన్వాజ్ మరో యువతితో కనిపించడాన్ని బాధితురాలు గమనించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో ఆమె కారు ముందు నిలబడినట్లు పోలీసులు చెబుతున్నారు. అనంతరం కారు ఆమెను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆమెను ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టాడా? లేక ఘటన అనుకోకుండా జరిగిందా? అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
షహన్వాజ్ తన అసలు గుర్తింపును దాచిపెట్టి తనతో పరిచయం పెంచుకున్నాడని బాధితురాలు ఆరోపించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఆరోపణను కూడా దర్యాప్తులో భాగంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనకు ముందు అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమీపంలోని టీ దుకాణం నిర్వాహకుడు మాట్లాడుతూ.. బాధితురాలు డ్రైవర్ను పదేపదే కారు ఆపాలని కోరినట్లు చెప్పాడు. డ్రైవర్ కొద్దిసేపు కారు అద్దాన్ని దించి ఆమెతో మాట్లాడాడని.. ఆ తర్వాత ఒక్కసారిగా కారును ముందుకు తీసుకెళ్లడంతో ఆమె కిందపడిపోయిందని వివరించాడు. మరో ప్రత్యక్ష సాక్షి కూడా బాధితురాలు కారును ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపాడు. కారు వెళ్లిపోయిన తర్వాత గాయపడిన యువతి సాయం కోసం కేకలు వేస్తుండగా.. ఆమెతో వచ్చిన బంధువు అక్కడికి చేరుకుని సహాయం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు సేకరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు. వీడియో, సీసీటీవీ ఫుటేజీ, బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. జనేశ్వర్ మిశ్రా పార్క్ లక్నోలోని రద్దీగా ఉండే ప్రధాన ప్రజా ప్రదేశాల్లో ఒకటి. ఈ ప్రాంతంలో గతంలోనూ దాడుల ఫిర్యాదులు, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రోడ్డు ప్రమాదాలు వంటి ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో భద్రత, నిఘాను మరింత పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిందితుడిని విచారించిన అనంతరం ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.

