పహల్గామ్ ఉగ్ర దాడి గుర్తుంది కదా? పర్యాటక ప్రాంతంలోకి ఉగ్రవాదులు ప్రవేశించి మతం పేరుతో దాదాపు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ముస్లింలను వదిలిపెట్టేసి.. కేవలం హిందువులనే చంపేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు తాజాగా శుక్రవారం జమ్మూకాశ్మీర్లోని కుల్గామ్లో జరిగిన ఘటన కూడా ఇప్పుడు పహల్గామ్ మాదిరిగానే జరగడం ఇప్పుడు హాట్ టాఫిక్గా మారింది.
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో వలస కార్మికులపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. కెల్లం ప్రాంతంలోని ఓ ఇటుక బట్టీ దగ్గర పనిచేస్తున్న వలస కార్మికుల పేర్లు, గుర్తింపును ఉగ్రవాదులు ముందుగా అడిగినట్లు సమాచారం. అనంతరం వారిలో హిందువులైన ఇద్దరు కార్మికులను ప్రత్యేకంగా వేరు చేసి అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారు.
ఇటుక బట్టీ దగ్గర పలువురు వలస కార్మికులు ఉన్నప్పటికీ.. మృతులైన ఇద్దరే హిందువులని.. అందుకే వారిద్దని చంపినట్లుగా గుర్తించారు. మత గుర్తింపు ఆధారంగా ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన పహల్గాం ఉగ్రదాడి తరహాలో జరిగి ఉండవచ్చనే అనుమానాలకు దారితీస్తోంది. అయితే ఉగ్రవాదులు కార్మికుల గుర్తింపును ఎలా నిర్ధారించారు, దాడికి ముందు ఏం జరిగిందనే అంశాలపై భద్రతా సంస్థలు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.
శుక్రవారం సాయంత్రం కుల్గాం జిల్లాలోని కెల్లం ప్రాంతంలో ఉన్న ఇటుక బట్టీపై ఉగ్రవాదులు దాడి చేశారు. అక్కడ పనిచేస్తున్న ఇద్దరు స్థానికేతర కార్మికులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరైన దీపక్ రాత్రే ఆస్పత్రికి తరలించేలోపే గాయాల తీవ్రతతో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరో కార్మికుడు బోపిందర్ను తొలుత అనంత్నాగ్లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం శ్రీనగర్లోని సౌరా ప్రాంతంలోని ఎస్కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం అతడు కూడా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
మృతులిద్దరూ 20 ఏళ్ల వయసులో ఉన్నారని, వారు ఛత్తీస్గఢ్కు చెందిన వారని అధికారులు తెలిపారు. ఉపాధి కోసం జమ్మూకశ్మీర్కు వచ్చి ఇటుక బట్టీ దగ్గర పనిచేస్తున్న సమయంలో ఈ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఒక స్థానిక ఉగ్రవాది, విదేశీ ఉగ్రవాది ప్రమేయం ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో అనుమానిస్తున్నట్లు సమాచారం. దర్యాప్తు అధికారులు మహమ్మద్ లతీఫ్ అనే వ్యక్తి పాత్రపై దృష్టి సారించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అతడు గత ఏడాది లష్కరే తోయిబా మద్దతుతో పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)లో చేరినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఈ అంశంపై భద్రతా సంస్థల నుంచి అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.
దక్షిణ కశ్మీర్లో ఇటీవల లక్ష్యిత దాడులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పది రోజుల కిందట అనంత్నాగ్ పట్టణంలో ఓ పోలీసు అధికారిని ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఘటన తర్వాత కుల్గాంలో వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని జరిగిన తాజా దాడితో భద్రతా వ్యవస్థ మరింత అప్రమత్తమైంది.
కుల్గాం ఉగ్రదాడిని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్రంగా ఖండించారు. ఘటనపై డీజీపీ నలిన్ ప్రభాత్తో పాటు ఉన్నత భద్రతా అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ఉగ్రవాదులపై చేపట్టే ఆపరేషన్లను మరింత ఉద్ధృతం చేయాలని భద్రతా బలగాలను ఆదేశించినట్లు వెల్లడించారు. ‘‘కుల్గాంలో జరిగిన పిరికిపంద ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనలో ఛత్తీస్గఢ్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులపై ఆపరేషన్లను మరింత వేగవంతం చేసి.. వారిని అంతమొందించాలని భద్రతా బలగాలను ఆదేశించాను’’ అని మనోజ్ సిన్హా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఉగ్రదాడి జరిగిన వెంటనే జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు కెల్లం ప్రాంతానికి చేరుకున్నాయి. ఘటనాస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని అన్ని మార్గాలను దిగ్బంధించాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించి పట్టుకునేందుకు విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. దాడి వెనుక ఉన్న వారిని గుర్తించి చట్టం ముందు నిలబెడతామని అధికారులు తెలిపారు.
I spoke with the DGP, Shri Nalin Prabhat and top security officials following the brutal terrorist attack in Kulgam in which a labourer from Chhattisgarh was killed. I strongly condemn this cowardly act. I have directed our security forces to step up their operations and…
— Manoj Sinha (@manojsinha_) July 31, 2026

