NTV Telugu Site icon

RG Kar hospital: వెలుగులోకి సందీప్ ఘోష్ ఆగడాలు.. వైద్యురాలు హత్యాచారం తర్వాత మాజీ ప్రిన్సిపాల్ ఏం చేశాడంటే..!

Rgkarhospital

Rgkarhospital

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. అనంతరం న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరిగాయి. పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే ఈ ఘటన తర్వాత నిందితుడు సంజయ్ రాయ్‌ను అరెస్ట్ చేసినా.. అన్ని వేళ్లు మాత్రం ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వైపే చూపించాయి. వైద్యురాలి హత్యాచార ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం బెంగాల్ ప్రభుత్వం మరొక కాలేజీలో అదే పోస్టు ఇచ్చింది. ఈ వ్యవహారం సంచలనం సృష్టించడంతో హైకోర్టు అతన్ని తప్పించింది.

ఇక ఈ కేసును హైకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది. లోతుగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్‌కి పాలీగ్రాఫ్ టెస్టు నిర్వహించింది. విచారణలో తనకేమీ తెలియదంటూ చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఇక ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై హైకోర్టు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ కస్టడీకి ఇచ్చింది. ప్రస్తుతం ఘోష్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

ఇదిలా ఉంటే సందీప్ ఘోష్‌కు సంబంధించిన అగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైద్యురాలి హత్యాచార ఘటన జరిగిన తర్వాతే.. సంఘటనాస్థలిలో మరమ్మత్తు పనులు చేయించినట్లుగా తెలుస్తోంది. సందీప్ ఘోష్ ఆదేశాలతో మరమ్మత్తులు జరిగినట్లుగా విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. హాస్పిటల్‌లోని డ్యూటీ డాక్టర్ల గదుల మరమ్మతులు మరియు పునరుద్ధరణ కోసం PWDకి సందీప్ ఘోష్ రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 9న వైద్యురాలు హత్యాచారానికి గురైతే.. ఆస్పత్రిలో పనులు పునరుద్ధరించాలని కోరుతూ సందీప్ ఘోష్ ఆగస్టు 10న పీడబ్ల్యూడీకి లేఖ రాశారు.

ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో ఆన్-డ్యూటీ వైద్యుల గదులు, ప్రత్యేక అటాచ్డ్ టాయిలెట్‌ల కొరత ఉందని మీకు తెలియజేస్తున్నాను. హాస్పిటల్‌లోని రెసిడెంట్ వైద్యుల డిమాండ్ మేరకు వెంటనే అవసరమైన వాటిని చేయవలసిందిగా లేఖ ద్వారా అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు.

వైద్యురాలి హత్యాచారం జరిగిన తర్వాతే ఈ విధంగా మరమ్మత్తులు చేయించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. న్యాయస్థానం కూడా తీవ్రంగా తప్పుపట్టింది. అయితే ఘటన తర్వాతే ఆస్పత్రిలో మరమ్మత్తు పనులు ఎందుకు చేయించాల్సి వచ్చింది? అన్నదానిపై సీబీఐ కూపీలాగుతుంది.

ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ఆగస్టు 9న వైద్యురాలు హత్యాచారానికి గురైంది. అత్యంత దారుణంగా ఆమె హత్యకు గురైంది. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఇక హైకోర్టు జోక్యం చేసుకుని సీబీఐ విచారణకు అప్పగించింది. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది.