Khap Panchayat: హర్యానా జింద్లోకి ఖాప్ పంచాయతీ పెద్దలు ‘‘స్వలింగ వివాహాలు’’, ‘‘సహజీవనం’’పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయ విలువలు, సామాజిక నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశారు. స్వలింగ వివాహాలు, లిన్ ఇన్ రిలేషన్లపై నిషేధిం విధించాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి 300 మంది పంచాయతీలకు చెందిన నేతలు ఈ సమాజిక సమస్యలపై తమ ఆందోళనల్ని లేవనెత్తారు. జూలై 28 ఆదివారం రోజున నిర్వహించిన ‘‘మహా పంచాయత్’’తో తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేకుండా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
Read Also: Dhanush ILAYARAJA: మోత మోగించడానికి రెడీ అవుతున్న ధనుష్ “ఇళయరాజా”
బెనైన్ ఖాప్ చీఫ్ రఘుబీర్ నైన్ లివ్-ఇన్ రిలేషన్షిప్స్ మరియు స్వలింగ వివాహాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. జంతువులు కూడా ఇలాంటి వాటికి పాల్పడవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సమ్మతితో నిర్వహించే ప్రేమ వివాహాలకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెబుతూనే, ఒకే గోత్రంలో వివాహాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మరో ఖాప్ నేత సంతోష్ దహియా మాట్లాడుతూ.. ఒకే గోత్రంలో వివాహాలు సామాజికంగా ప్రభావం చూపించడమే కాకుండా, జన్యుపరమైన సమస్యలకు దారి తీస్తాయని చెప్పారు. కాబట్టి ఒకే గోత్రంలో వివాహాలను నిషేధించాలని సూచించారు.
లివ్-ఇన్ రిలేషన్షిప్ భావనను మరియు భారతదేశంలో దాని చట్టబద్ధతను కూడా నాయకులు వ్యతిరేకించారు. “లివ్-ఇన్ సంబంధాలు కుటుంబ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నాయని అన్నారు. ఇవి సమాజం, పిల్లలు, మన సంస్కృతిపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని దహియా ఆందోళన వ్యక్తం చేశారు. లివ్ ఇన్ సంబంధాల వల్ల మహిళలు ప్రభావితమవుతున్నారని అన్నారు. ఖాప్ పంచాయితీ ప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్రమోదీని, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి చట్ట సవరణలను కోరాలని అనుకుంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని, ఇందుకోసం 51 మంది సభ్యులతో కమిటీని వేస్తున్నట్లు వెల్లడించారు.