Kuwait Fire Accident: కువైట్ వెళ్లేందుకు కేంద్రం అనుమతించలేదు.. కేరళ మంత్రి ఆరోపణలు..

  • కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం..
  • గల్ఫ్ దేశానికి వెళ్లేందుకు కేంద్రం అనుమతించలేదు..
  • కేరళ మంత్రి వీణా జార్జ్ ఆరోపణలు..
  • మృతుల్లో ఎక్కువ మంది కేరళ వాసులే..
Veenageorge

Veenageorge

Kuwait Fire Accident: గల్ఫ్ దేశం కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదంలో మనదేశంలో తీవ్ర విషాదం నింపింది. మంగాఫ్ నగరంలో బుధవారం ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 48 మంది కార్మికులు మరణించగా.. ఇందులో 45 మంది భారతీయులు ఉన్నారు. బాధితుల్లో కేరళకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి చెందిన 23 మందితో పాటు తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఇద్దరు, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.

Read Also: Maharaja Review: విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా రివ్యూ.. హిట్టా ? ఫట్టా?

ఇదిలా ఉంటే కువైట్‌లో అగ్నిప్రమాద బాధితులను సమన్వయం చేసేందుకు కువైట్ వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం తనను అనమతించలేదని, కేంద్రం అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరమని కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ శుక్రవారం అన్నారు. మరణించిన వారిలో సగాని కన్నా ఎక్కువ మంది కేరళకు చెందిన వారే ఉన్నారని, చికిత్స పొందుతున్న వారిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని ఆమె అన్నారు.

కేరళ రాష్ట్ర ప్రభుత్వం గురువారం అత్యవసర క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది మరియు రాష్ట్ర మిషన్ డైరెక్టర్ (NHM) జీవన్ బాబుతో కలిసి వీణా జార్జ్ అత్యవసరంగా కువైట్‌కు వెళ్లి గాయపడిన వారి చికిత్సకు సంబంధించిన ప్రయత్నాలను సమన్వయం చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. బాధితుల మృతదేహాలను స్వదేశానికి తరలించడాన్ని పర్యవేక్షించాలని భావించారు. అయితే, కేంద్రం నుంచి సమ్మతి లభించలేదు. ఇదిలా ఉంటే కువైట్ నుంచి 45 మంది భారతీయుల మృతదేహాలతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన విమానం బయలుదేరింది. ప్రమాదం విషయం తెలియడంతో భారత విదేశాంగ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్, కువైట్ వెళ్లారు. అక్కడ సహాయకచర్యల్ని పర్యవేక్షించారు.