కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఎండకాలం భయంతో ఎండ దెబ్బ తగలకుండా ఉండేందుకు ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలివచ్చారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభానికి ముందే పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అన్ని పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిటకిటలాడుతున్నాయి.
ఇక కేరళంలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కన్నూరులోని ఆర్సీ అమల బేసిక్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కేంద్రమంత్రి సురేష్ గోపీ, నటుడు మోహన్ లాల్, తదితర నాయకులంతా ఉదయాన్నే ఓటు వేశారు. ముఖ్యంగా యువత ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు తరలివచ్చి ఓటు వేస్తు్న్నారు.
మోడీ పిలుపు
కేరళ, అసోం, పుదుచ్చేరిలో పోలింగ్ జరగడంతో ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించాలని కోరారు.
అసోంలో 126 స్థానాలకు 722 మంది పోటీ చేస్తున్నారు. కేరళలో 140 స్థానాల్లో 883 అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. పుదుచ్చేరిలో 30 స్థానాలకు గాను 294 మంది అభ్యర్థులు ఉన్నారు.
మొత్తం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈరోజు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో జరుగుతుండగా తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో జరగనున్నాయి.
తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్లోని 152 స్థానాలకు మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. ఇక పశ్చిమ బెంగాల్లో 142 స్థానాలకు రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న విడుదలకానున్నాయి.
