BK Hariprasad: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) నూతన అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఈ నియామకం జరగడం గమనార్హం. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. బీకే హరిప్రసాద్ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఇప్పటి వరకు కర్ణాటకలో పార్టీని విజయపథంలో నడిపించి, కేపీసీసీ అధ్యక్షుడిగా విశేష సేవలందించిన డీకే శివకుమార్ సహకారాన్ని పార్టీ కొనియాడింది.
సిద్ధరామయ్య అభినందనలు..
బీకే హరిప్రసాద్ నియామకంపై మాజీ సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హరిప్రసాద్కు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీ పట్ల ఉన్న విధేయత, పోరాట పటిమ రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు దోహదపడతాయని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు సిద్ధరామయ్య పేర్కొన్నారు. బీకే హరిప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా నమ్మకమైన నాయకుడిగా కొనసాగుతున్నారు. గతంలో ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, పలు రాష్ట్రాల పార్టీ ఇన్ఛార్జ్గా, రాజ్యసభ సభ్యుడిగా వివిధ కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు. డీకే శివకుమార్ ప్రభుత్వ బాధ్యతల్లో బిజీగా మారనున్న నేపథ్యంలో, సంస్థాగతంగా పార్టీని నడిపించేందుకు అధిష్ఠానం ఈ అనుభవజ్ఞుడైన ఓబీసీ నాయకుడి పగ్గాలు అప్పగించిందని చెబుతున్నారు.
