543 మంది చిన్నారులకు కోవిడ్.. సీఎం అత్యవసర సమావేశం..

children

దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.. ఇక, థర్డ్‌ వేవ్‌ ప్రారంభం అయ్యిందంటూ ఓవైపు.. థర్డ్‌ వేవ్‌ ముప్పు చిన్నారులకే ఎక్కువనే హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో.. బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. 11 రోజుల్లో 543 మంది పిల్లలకు కరోనా సోకింది. ఆగస్టు 1 నుంచి 11 మధ్యకాలంలో నగరంలో 543 మంది పిల్లలకు కరోనా సోకినట్లు బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె వెల్లడించింది. వీరిలో 210 మంది పిల్లలు 0 నుంచి 9 ఏళ్ళలోపు పిల్లలు కాగా, 10 నుంచి 19 మధ్య వయస్కుల సంఖ్య 333 మంది ఉన్నట్లు తెలిపింది. అయితే వీరిలో ఎవరూ కరోనాతో మరణించలేదని.. చాలా మందిలో కరోనా లక్షణాలు లేవని చెప్పింది. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించాల్సిందిగా ఆదేశించారు.