Beware Bachelors: పెళ్లి ఈ రెండు అక్షరాల పదం ప్రతీ ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైంది. ఇద్దరు మనుషులు, రెండు కుటుంబాల మధ్య సరికొత్త బంధాన్ని, ఒక నమ్మకాన్ని తీసుకువచ్చేది వివాహం. అలాంటిది ఈ రోజుల్లోల పెళ్లి పేరుతో లెక్కకు మించిన మోసాలు బయట పడటం కలకలం సృష్టిస్తుంది. అలాంటి మోసం ఒకటి ఇప్పుడు బయటికి ప్రపంచం ముందుకు వచ్చి వైరల్ అవుతుంది. పెళ్లి సంబంధాల పేరుతో దేశవ్యాప్తంగా అమాయక బ్యాచిలర్లను ముంచేస్తున్న ఒక భారీ అంతర్రాష్ట్ర మ్యాట్రిమోనియల్ మోసాల నెట్వర్క్ను తాజాగా కాన్పూర్ పోలీసులు బట్టబయలు చేశారు. కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్, సైబర్ సెల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మెరుపు దాడిలో.. ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ వేదికగా సాగుతున్న నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టయింది. ఏఐ సృష్టించిన అందమైన అమ్మాయిల ఫోటోలతో ఎరవేసి, ఈ ముఠా ఇప్పటివరకు వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఏఐ సుందరాంగులతో ఎర..
పోలీసుల విచారణలో ఈ ముఠా సాగించిన మోసాల తీరు చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు. నిందితులు ముందుగా నకిలీ వివాహ వెబ్సైట్లను ఏర్పాటు చేశారు. పెళ్లి చేసుకోవాలనుకునే యువకులను ఆకర్షించడానికి.. ఆ వెబ్సైట్లలో నిజమైన అమ్మాయిల ఫోటోలకు బదులు ‘ఏఐ’ సాంకేతికతతో సృష్టించిన అందమైన నకిలీ అమ్మాయిల ఫోటోలను ఉంచారు. ఈ ఫోటోలు చూసి మోసపోయి సైట్లో రిజిస్టర్ చేసుకున్న బాధితులకు.. ఈ కాల్ సెంటర్లో పని చేసే మహిళలు ఫోన్లు చేసేవారు. తామే ఆ ప్రొఫైల్లోని అమ్మాయిలమంటూ మాయమాటలు చెప్పి, ప్రేమగా మాట్లాడుతూ బాధితుల నమ్మకాన్ని గెలుచుకునే వారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రొఫైల్ యాక్టివేషన్, నేరుగా కలవడం లేదా ఫోన్ నంబర్లు ఎక్స్ఛేంజ్ చేసుకోవడం వంటి రకరకాల సాకులు చెబుతూ భారీగా డబ్బులు వసూలు చేసేవారు.
అపార్ట్మెంట్పై పోలీసుల దాడి..
కళ్యాణ్పూర్ పరిధిలోని ఆవాస్ వికాస్ ఏరియాలోని ఒక అపార్ట్మెంట్లో అనుమానాస్పద ఆన్లైన్ కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సైబర్ సెల్ రంగంలోకి దిగి దాడి చేయగా.. అక్కడ ‘ఆన్లైన్ మ్యాచ్ పాయింట్’ అనే పేరుతో నకిలీ మ్యాట్రిమోనియల్ కాల్ సెంటర్ నడుస్తున్నట్లు తేలింది. ఈ ఆపరేషన్లో భాగంగా స్కామ్కు సూత్రధారులైన అనురాధ త్రివేది, విక్రమ్ ఖుటే, ప్రియాంకలను పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ వెస్ట్ ఎస్ఎం ఖాసిం అబిది మాట్లాడుతూ.. ఈ దాడి సమయంలో కాల్ సెంటర్లో పనిచేస్తున్న దాదాపు 15 మంది యువతులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
రోజుకు 150 మంది టార్గెట్..
ఈ ముఠా గత ఒకటిన్నర సంవత్సరాలుగా అత్యంత పకడ్బందీగా ఈ నెట్వర్క్ను నడుపుతోందని అధికారులు వెల్లడించారు. కాల్ సెంటర్లో పనిచేసే మహిళలకు ప్రతిరోజూ పెళ్లి కావాల్సిన 100 నుంచి 150 మంది యువకుల ఫోన్ నంబర్లను ఇచ్చేవారు. టెలికాలర్లు సదరు బాధితులతో మాట్లాడి వారి ఇష్టాలు, వయస్సు, ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరించేవారు. దానికి తగినట్లుగా ఏఐ ఫోటోలను పంపి వల విసిరేవారు. ప్రాథమిక విచారణలో ఈ ముఠా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10,000 నుంచి 15,000 మందికి పైగా యువకులను లక్ష్యంగా చేసుకుని, కోట్ల రూపాయలు గుంజినట్లు తేలింది. అరెస్ట్ చేసిన ముగ్గురు ప్రధాన నిందితులను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఈ ముఠాకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, మొబైల్ కాల్ రికార్డులు, ఆన్లైన్ డిజిటల్ లావాదేవీలపై సైబర్ పోలీసులు నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

